
Bharat Jodo Yatra: టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటే, అది మంచిది. అతను గ్లోబల్ పార్టీని స్థాపించాలనుకుంటే, చైనాలో, యూకే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే, అది కూడా మంచిది. కానీ వాస్తవమేమిటంటే, బీజేపీ సిద్ధాంతాన్ని ఓడించగలిగేది కాంగ్రెస్ సిద్ధాంతం మాత్రమే" అని అన్నారు. అలాగే, దేశంలో వివిధ సంస్థలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయనీ, తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, ఈ సంస్థలను ఆర్ఎస్ఎస్ పట్టు నుండి విముక్తి చేస్తామని కూడా అన్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్త కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమరి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూరులో మీదుగా యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. “వివిధ సంస్థలపై వ్యవస్థీకృత దాడి జరిగింది. న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, మీడియాపై దాడి జరుగుతోంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ సంస్థలను ఆర్ఎస్ఎస్ పట్టు నుండి విముక్తం చేసి, ఈ సంస్థల్లో స్వాతంత్య్రం కొనసాగేలా చూస్తాం” అని రాహుల్ గాంధీ అన్నారు.
అలాగే, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)తో కాంగ్రెస్ సంబంధాలపై కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కలిసి ముందుకు సాగుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందనీ, ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోదని అన్నారు. దేశంలో బీజేపీని ఒడించే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. 'మా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ. మేము నియంతృత్వాన్ని నడపలేమని మా డీఎన్ఏ లో ఉంది. ఇటీవల మా పార్టీ అధ్యక్షుడిని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తాయా అని నేను ఆశ్చర్యపోతున్నాను” అని రాహుల్ గాంధీ అన్నారు.
గుజారత్ లో మోర్బీ వంతేన కూలిన ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ.. దానిని రాజకీయం చేయదలుచుకోలేదని అన్నారు. అక్కడ సమాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. "నేను ఈ సంఘటనను (మోర్బీ వంతేన కూలిన ఘటన) రాజకీయం చేయదలచుకోలేదు. అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారు ఇలా చేయడం అగౌరవం. కాబట్టి నేను అలా చేయబోవడం లేదు" అని అన్నారు.