
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ 20ఏళ్ల దళిత యువకుడిపై కొందరు అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తమ ఎదురుగా ఉన్నది కనీసం ఒక మనిషి అనే విషయాన్ని కూడా మరచిపోయి వ్యవహరించారు. అత్యంత పాశవంగా యువకుడిపై దాడి చేశారు.
రెండు రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. బాధిత యువకుడి జట్టుపట్టుకొని లాగి మరీ కొట్టారు. చేతిలో పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వాటితో చితకబాదారు.
అతడి కులం గురించి అడగ్గా..పలానా అని చెప్పగా...మరింత కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. దెబ్బలకు తట్టుకోలేక సదరు యువకుడు కేకలు వేసినప్పటికీ..కనికరం చూపకుండా దాడి చేశారు. మరో వీడియోలో అతన్ని చేతులు కట్టి..కర్రతో ప్రైవేట్స్ పార్ట్లో ఇష్టానుసారంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా, మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో గురించి తెలియగానే, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పి ఘన్శ్యామ్ చౌరాశియా చెప్పారు. ఒకరిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు కోసం వెతుకుతున్నామని చెప్పారు. బాధితుడ్ని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఎందుకు చేశారు అనే విషయం మాత్రం తెలియరాలేదు.