
న్యూఢిల్లీ: బీజేపీ నేత నుపుర్ శర్మ ఓ టీవీ డిబేట్లో మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలను రేపాయి. ముస్లిం సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఆమెకు తాజాగా, ఉగ్రవాద సంస్థ ముజాహిదీన్ ఘజ్వతుల్ హింద్ నుంచీ బెదిరింపులు వచ్చినట్టు తెలిసింది. తాను చేసిన వ్యాఖ్యల కారణంగా దారుణమైన బెదిరింపులు వస్తున్నాయని ఈ నేపథ్యంలో నుపుర్ శర్మ ఢిల్లీ పోలీసులకు తెలిపింది. దీంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. నుపుర్ శర్మ, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించింది.
జమ్ము కశ్మీర్లో ఈ ఉగ్రవాద సంస్థ యాక్టివ్గా ఉన్నది. ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్లో ఈ ఏడాది జనవరిలో ఈ ఉగ్రవాద సంస్థే పేలుడు పదార్థాలను పాతిపెట్టినట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ సంస్థ టెలిగ్రామ్లో నుపుర్ శర్మ, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేసింది. నుపుర్ శర్మ ప్రవక్తను అవమానించిందని, ఇప్పుడు మళ్లీ క్షమాపణలు చెబుతున్నదని వివరించింది. బీజేపీ చాణక్య నీతి ద్వారా ప్రజలను వంచిస్తున్నదని పేర్కొంది. ఈ పార్టీ ద్వంద్వ వైఖరి కలిగి ఉన్నదని ఆరోపించింది. బీజేపీ నేతలు తరుచూ ముస్లిం వ్యతిరేకత ప్రకటనలు చేస్తూనే ఉన్నారని, ఆర్ఎస్ఎస్, రామ సేన, బజరంగ్ దళ్, శివసేనలు ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేస్తూనే ఉన్నాయని పేర్కొంది.
నుపుర్ శర్మ బేషరతుగా ఆమె ప్రకటనలు వెనక్కి తీసుకోవాలని ఆ మిలిటెంట్ గ్రూప్ డిమాండ్ చేసింది. మొత్తం ప్రపంచానికి ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. ప్రవక్తను అవమానించడానికి ప్రయత్నించిన వారికి ఎలాంటి శిక్ష పడిందో అలాంటిదే ఈమెపైనా అమలు చేస్తామని బెదిరించింది.
నుపుర్ శర్మకు చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని మే 28వ తేదీన సైబర్ సెల్ యూనిట్కు ఆమె నుంచి ఫిర్యాదులు వచ్చిందని పోలీసులు చెప్పారు. వీటిని దర్యాప్తు చేస్తూ ఉండగానే మరో ఫిర్యాదు నుపుర్ శర్మను వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా నుపుర్ శర్మ, ఆమె కుటుంబానికి భద్రత కల్పిస్తున్నట్టు పోలీసులు వివరించారు.