
ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారి మానవ హక్కుల విషయంపై కొందరు మాట్లాడుతున్నారని, కానీ ఉగ్రవాదం కారణంగా చనిపోయే వారికి కూడా మానవ హక్కులు ఉంటాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘స్వరాజ్ నుంచి న్యూ ఇండియాకు భారతదేశ ఆలోచనలను పునశ్చరణ’’ అనే అంశంపై జరిగిన సెమినార్ కు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
స్కూల్ను దత్తత తీసుకున్న పోలీసు అధికారి.. రోజూ గంట టీచ్ చేస్తున్న పోలీసు బృందం
ఈశాన్య ప్రాంతాల నుంచి 75 శాతం వరకు AFSPA ను తొలగించామని చెప్పారు. మానవ హక్కుల ప్రాతిపదికన చట్టాన్ని తొలగించాలని కోరిన వారికి ఒక విషయం గుర్తు చేయాల్సి ఉందని అన్నారు. ‘‘ కొందరు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారి మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఉగ్రవాదం వల్ల చనిపోయేవారికి కూడా మానవ హక్కులు ఉన్నాయని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను ’’ అని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని కూడా అమిత్ షా ప్రస్తావించారు. ‘‘పీఎం నరేంద్ర మోడీ 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 ను రద్దు చేశారు. అయితే ‘ ఖూన్ కీ నదియన్ బహేంగీ’ అని చెప్పినవారు రాళ్లు రువ్వడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు’’ అని అమిత్ షా అన్నారు.
Sunil Jakhar : బీజేపీలో చేరిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్
సైద్ధాంతిక పోరాటాలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇవి అభిప్రాయాల మార్పిడికి వేదికగా మారాలని సూచించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేదని, అందరూ స్వాగతించారని ఆయన చెప్పారు.
భారత రక్షణ విధానం విషయంపై అమిత్ షా మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు దేశానికి రక్షణ విధానం లేదని అన్నారు. అప్పటి వరకు అది ఉనికిలో ఉన్నప్పటికీ, అది కేవలం విదేశాంగ విధానానికి ‘నీడ’ అని మాత్రమే చెప్పారు. ‘‘ప్రధాని మోదీకి ముందు భారత్లో రక్షణ విధానం లేదు.. అది కూడా విదేశాంగ విధానానికి నీడగా ఉండేది. ఇంతకు ముందు ఉగ్రవాదులను మనపై దాడికి పంపేవారు. ఉరీ, పుల్వామాలో కూడా అలాంటి ప్రయత్నాలు జరిగాయి. కానీ సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో రక్షణ విధానం అంటే ఏమిటో చూపించాం’’ అని అమిత్ షా అన్నారు.