నిర్భయ కేసు, ఉరి అనుమానమే: కోర్టుకెక్కిన ఇద్దరు దోషులు

By telugu teamFirst Published Feb 29, 2020, 7:33 PM IST
Highlights

మార్చి 3వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాల్సిన నేపథ్యంలో నిర్భయ కేసు నలుగురు దోషుల్లో ఇద్దరు కోర్టుకెక్కారు. డెత్ వారంట్ పై స్టే ఇవ్వాలని కోరుతూ పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

న్యూఢిల్లీ: మార్చి 3వ తేదీన ఉరిశిక్ష అమలు కాకుండా నిర్భయ కేసు దోషులు మరో ఎత్తు వేశారు. నిర్భయ కేసులోని నలుగురు దోషులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు ఇటీవల డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణశిక్షపై స్టే విధించాలని కోరుతూ ఇద్దరు దోషులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

అక్షయ్ సింగ్, పవన్ గుప్తా స్టే కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. దానిపై 2వ తేదీన తమ ప్రతిస్పందనను తెలియజేయాలని కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఈమేరకు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా నోటీసులు జారీ చేశారు. 

Also Read: మరో ఎత్తు: నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్

తాను తాజాగా రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నానని, అది పెండింగులో ఉందని అక్షయ్ సింగ్ తన తరఫు న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశాడు. ఇంతకు ముందు రాష్ట్రపతి తిరస్కరించిన మెర్సీ పిటిషన్ లో పూర్తి వాస్తవాలు లేవని అక్షయ్ సింగ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు. 

తాను దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని, అది పెండింగులో ఉందని, మరోవైపు తాను మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే ఆప్షన్ కూడా ఉందని పవన్ గుప్తా చెప్పాడు. పలు ఇతర పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు, ఇతర అథారిటీల ముందు పెండింగులో ఉన్నాయని ఇద్దరు దోషులు కూడా చెప్పారు.  

Also Read: నిర్భయ కేసు: మరోసారి దోషి వినయ్ శర్మ అవి మింగి....

నలుగురు దోషులను మార్చి 3వల తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు ఫిబ్రవరి 17వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ కుమార్ (31)లకు ఉరిశిక్ష విధించాలని డెత్ వారంట్ జారీ చేసింది. 

click me!