కరోనా అలర్ట్: బెంగళూరులో కాలు పెట్టాలంటే.. ఇది తప్పనిసరి

By Siva KodatiFirst Published Mar 25, 2021, 8:47 PM IST
Highlights

భారతదేశంలో కరోనా కేసులు కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రవేశించిందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌లలో వైరస్‌‌ను అడ్డుకునేందుకు పలు చోట్ల లాక్‌డౌన్‌ విధించాయి

భారతదేశంలో కరోనా కేసులు కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రవేశించిందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌లలో వైరస్‌‌ను అడ్డుకునేందుకు పలు చోట్ల లాక్‌డౌన్‌ విధించాయి. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా నడిచే అవకాశాలు వున్నాయి. కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు, ప్రయాణీకులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది.

ఇదే సమయంలో కేసుల తీవ్రత దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బయట రాష్ట్రాల నుంచి బెంగళూరుకి వచ్చే ప్రయాణీకులకు ఆర్‌టీ- పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసింది.

నిన్న ఒక్కరోజే రాజధానిలో 1400 కొవిడ్‌ కేసులు రావడంతో గురువారం ఉదయం మంత్రి సుధాకర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బెంగళూరు లో నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో 60శాతానికి పైగా అంతర్రాష్ట్ర ప్రయాణికులే ఉన్నారని చెప్పారు.

బస్‌ స్టేషన్లు, మార్కెట్లు, థియేటర్లు, కల్యాణ మండపాలు, కన్వెన్షన్‌ హాళ్లు, పాఠశాలలు, కళాశాలల క్యాంపస్‌ల వద్ద భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలు అమలయ్యేలా మార్షల్స్‌ను పెడతామని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

ఏప్రిల్‌ 1 నుంచి ఆర్టీపీసీఆర్ నిబంధనను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఈ నిబంధన కేవలం బెంగళూరు నగరానికి మాత్రమే వర్తిస్తుందని.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు పర్యాటకులు స్వేచ్ఛగా వెళ్లొచ్చని సుధాకర్ చెప్పారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా వున్న మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నిబంధన తప్పనిసరని మంత్రి స్పష్టం చేశారు. 

click me!