
Former Maharashtra cm Uddhav Thackeray: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ థాక్రే మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకులు దేశం కోసం పోరాడటానికి ఏకమయ్యారనీ పోరాటం ఒక పార్టీకి లేదా ఒక నిర్దిష్ట కుటుంబానికి మాత్రమే పరిమితం కాదని అన్నారు. "దేశం మా కుటుంబం, మేము దాని కోసం పోరాడుతున్నాము" అంటూ ప్రతిపక్ష నాయకులు వారసత్వ రాజకీయాలను అనుసరిస్తున్నారనీ, వారి కుటుంబాల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని బీజేపీ చేసిన విమర్శలకు థాక్రే కౌంటర్ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయెన్స్ (ఇండియా) కింద ఏకతాటిపైకి వస్తాయని ప్రకటించిన నేపథ్యంలో థాక్రే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ పోరాటం తమ పార్టీకి మాత్రమే పరిమితం కాదనీ, ఇది కుటుంబం కోసమేనని కొందరు అనుకుంటున్నారనీ, అందుకే తామంతా ఒక్కటయ్యామని చెప్పారు. దేశమే తమ కుటుంబమనీ, తాము దేశ ప్రజల కోసం పోరాడుతున్నానీ, ఈ కుటుంబాన్ని రక్షించాలనుకుంటున్నామని చెప్పారు. తమ పోరాటం ఒక పార్టీకి లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కాదనీ, ఇది విధానం-నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు భయపడవద్దంటూ.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన పాపులర్ హిందీ చిత్రం 'మై హూన్ నా' వ్యాఖ్యలను ఉటంకించారు. "భయపడే ప్రజలు, మేము ఇక్కడ ఉన్నామని భయపడవద్దని మేము వారికి చెప్పాలనుకుంటున్నాము. "మై హూన్ నా అనే సినిమా ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారు, ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ భారతదేశం కాకూడదు, ప్రజలు అంటే దేశం, మేము మా దేశాన్ని సురక్షితంగా ఉంచుతామని" చెబుతూ... ప్రతిపక్ష నాయకుల సమావేశం గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యామనీ, తదుపరి సమావేశం ముంబయిలో జరుగుతుందని, తేదీలను త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు.
తమ పోరాటం ఒక పార్టీకి, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కాదని, విధానానికి, నియంతృత్వానికి వ్యతిరేకమని ఉద్ధవ్ థాక్రే అన్నారు. బెంగళూరు సమావేశం గురించి మాట్లాడుతూ.. 'ప్రతిపక్షాల రెండో విజయవంతమైన సమావేశం ఇది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్నారని మీరు చూశారు. ఖర్గేజీ, మీరు కూటమి పేరు భారత్ అని చెప్పారు, అందుకోసం మేం ఒక్కటయ్యాం' అని థాక్రే అన్నారు. భిన్న భావజాలం ఉన్న వ్యక్తులు ఏకమవుతున్నారని చాలా మంది అడుగుతున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ భిన్న భావజాలాలు ఉండాలనీ, అందుకే దీనిని ప్రజాస్వామ్యం అంటారని ఆయన అన్నారు. అలాగే, తాము స్వాతంత్య్రం కోసం పోరాడామనీ, ఇప్పుడు స్వాతంత్య్రం ప్రమాదంలో పడిందనీ, అందుకే తాము ఒక్కటయ్యామనీ, తప్పకుండా విజయం సాధిస్తామని ఆశిస్తున్నామని చెప్పారు.
కాగా, ప్రతిపక్ష పార్టీల కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (ఇండియా) అని పేరు పెట్టామనీ, ఎన్నికల ప్రచార నిర్వహణ కోసం ఢిల్లీలో సెక్రటేరియట్ ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రకటించారు. 11 మందితో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామనీ, సభ్యుల పేర్లపై ముంబయి సమావేశంలో చర్చిస్తామన్నారు.