
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో గతేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన ఒక చిరుతపులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక్కడికి తీసుకొచ్చిన చిరుతల్లో ఒకటైన సాషా కిడ్నీ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. తల్లితో పులి పిల్లలు వున్న వీడియోను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
సాషాతో పాటు మరో ఏడు చిరుతల్ని గతేడాది సెప్టెంబర్లో నమీబియా నుంచి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాలుగున్నర సంవత్సరాలకు పైగా వయసున్న సాషా మరణించడంతో ప్రాజెక్ట్ చీతాకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. భారతదేశంలో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనదేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో మరణించింది. ఈ క్రమంలో దేశంలో చిరుతలు పూర్తిగా అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం 1952లో అధికారికంగా ప్రకటించింది.
సాషాను మినహాయించి.. మిగిలిన ఏడు చిరుతలు బాగానే జీవిస్తున్నాయి. ఈ ఏడింటిలో మూడు మగ, ఒక ఆడ చిరుతను పార్క్లోని ఓపెన్ ఫారెస్ట్ ఏరియాలో విడుదల చేశామని అవి పూర్తి ఆరోగ్యంగా వుండటంతో పాటు సాధారణ పద్ధతిలోనే వేట సాగిస్తున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జెఎస్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే గత నెలలో దక్షిణాఫ్రికా నుంచి కునో నేషనల్ పార్క్కు తీసుకొచ్చిన 12 చిరుతులను ప్రస్తుతం క్వారంటైన్ ఎన్క్లోజర్లో వుంచినట్లు ఒక అధికారి వెల్లడించారు. అవి కూడా ఆరోగ్యంగా, చురుగ్గా వున్నట్లు ఆయన చెప్పారు.