
Mustard oil tanker overturns: ఆవనూనె తో వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రోడ్డుపై ట్యాంకర్ లోంచి నూనె బయటకు వస్తుండటంతో దానిని పట్టుకోవడానికి జనం ఎగబడ్డారు. క్యాన్లు, బిందెలతో ఆయిల్ ట్యాంకర్ చుట్టూ జనం ఆవనూనెను పట్టుకోవడానికి ఎగబడ్డ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో ఆవనూనెతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయిల్ లీకేజీ విషయం తెలిసిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బాటిళ్లు, క్యాన్లు, బిందెలు, కంటైనర్లలో నూనెను సేకరించడం మొదలు పెట్టారు. ఈ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కొంతసమయం పాటు గందరగోళ పరిస్థితి ఏర్పడిందని ఇండియా టూడే నివేదించింది.
గుజరాత్ లోని గాంధీధామ్ నుంచి మధ్యప్రదేశ్ కు తరలిస్తున్న వందలాది లీటర్ల ఆవనూనెతో ఆయిల్ ట్యాంకర్ బయలు దేరిందనీ, ఈ క్రమంలోనే సిరోహి జిల్లాలలో ప్రమాదానికి గురై బోల్తా పడిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను వివరిస్తూ.. ఆకస్మాత్తుగా రోడ్డుపైకి బైక్ వచ్చిందనీ, ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని ఓ మోటారుసైకిల్ ను కాపాడే ప్రయత్నంలో ట్యాంకర్ అదుపుతప్పి పిండ్వాడ సమీపంలోని నాలుగు లైన్ల రహదారిపై బోల్తా పడిందని చెప్పారు.
విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడి చేరుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు బాటిళ్లు, కంటైనర్లతో సంఘటనా స్థలానికి చేరుకుని లీకైన ఆవనూనెను సేకరించడం ప్రారంభించారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. ట్యాంకర్ ను కూడా అక్కడి నుంచి పైకి లేపి ట్రాఫిక్ జామ్ లను తొలగించారు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.