
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రపై పూల వర్షం కురిపించిన ముస్లింలు మత సామరస్యం చాటారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపులో ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు పూల వర్షం కురిపించారు. వివరాలు.. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
హనుమాన్ జయంతి ఊరేగింపులో పాల్గొన్న భక్తులపై ముస్లిం సంఘం సభ్యులు పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్గా మారింది. ‘‘“మేము ఊరేగింపును స్వాగతించడానికి ఇక్కడకు వచ్చాము. మా నగరంలో ఉన్న హిందూ-ముస్లిం సోదర సంప్రదాయం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’’ అని ముస్లింలు చెప్పారు.
ఇక, హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా భద్రత చర్యల్లో భాగంగా.. భద్రతా కారణాల దృష్ట్యా తినుబండారాలు, టీ స్టాల్స్ మినహా చాలా వ్యాపార సంస్థలు మూసివేశారు. ఖాజీ క్యాంప్ ఏరియాలో శోభాయాత్రకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వేరే మార్గంలో శోభాయాత్రను కొనసాగించారు. దీంతో హనుమాన్ జయంతి ఊరేగింపు.. తాళ్లయాలోని కాళీ మందిర్ నుంచి బయలుదేరి చార్ బత్తి చౌరాహా, బుద్వారా, ఇత్వారా, ఆజాద్ మార్కెట్, జుమెరాటి, గోదా నక్కాస్, నద్రా బస్టాండ్ మీదుగా సాగి సింధీ కాలనీ వద్ద ముగిసింది.
రాష్ట్ర రాజధాని నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 5,000 మంది భక్తులు.. జై జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ, తమ చేతుల్లో కాషాయ జెండాలను పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న మత విద్వేషాలను దృష్టిలో ఉంచుకుని.. ఇతర మతాలు లేదా వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసే అభ్యంతరకర నినాదాలు, బ్యానర్లు, పోస్టర్లను పోలీసులు అనుమతించలేదు.