
mother sells daughter for Rs 4 lakh: పేగు బంధాలకు కూడా విలువలేకుండా మారుతున్న నేటి నాగరిక సమాజంలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ 14 కోసం తల్లిదండ్రులు తమ సొంత కన్నబిడ్డను విక్రయించిన ఘటన మరువకముందే ఇదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన కన్న కూతురిని 4 లక్షల రూపాయలకు విక్రయించింది. ఈ ఘటన పశ్చిమ బెంగల్ లో చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
21 రోజుల పసికందును రూ.4 లక్షలకు అమ్మిన తల్లి ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా నగరంలో.. 21 రోజుల పాపను రూ.4 లక్షలకు అమ్మేసింది ఒక తల్లి. ఈ ఘటన ఆనంద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నొనదంగ రైల్ కాలనీలో చోటుచేసుకుంది. నిందితురాలైన తల్లిని రూపాలీ మొండల్ గా గుర్తించారు. పోలీసులు వివరాలను వెల్లడిస్తూ.. ''రూపాలీ మొండల్ అనే మహిళ తన 21 రోజుల పసికందును మేదినీపూర్ కు చెందిన కళ్యాణి గుహ అనే మహిళకు విక్రయించింది. కళ్యాణి గుహ ఇల్లు మేదినీపూర్ లో ఉంది, కానీ ఆమెకు కోల్ కతాలో తాత్కాలిక చిరునామా కూడా ఉంది. నలుగురు మధ్యవర్తుల ద్వారా రూపాలీ తన కుమార్తెను కల్యాణికి విక్రయించిందని'' తెలిపారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఆనంద్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైందన్నారు.
ముందు ఈ ఘటన గురించి ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఫిర్యాదు మేరకు ఆనంద్ పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులను పోలీసులు ప్రశ్నించడంతో చిన్నారి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారిని అమ్మేసినట్లు అంగీకరించారు. కళ్యాణి గుహకు సంతానం లేదనీ, చాలా రోజులుగా బిడ్డ కోసం వెతుకుతున్నారని సమాచారం. కల్యాణి గుహ కోల్ కతా చిరునామా పోర్న్శ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్గ్రామ్ ప్రాంతంలో ఉంటుంది. అప్పుడే ఎవరో వచ్చి వారికి ఓ బిడ్డను ఇచ్చారు. భారీగా డబ్బును తీసుకున్నారు. ఈ ఘటనలో పలువురు దళారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రూప దాస్, పాటూలీకి చెందిన స్వప్న సర్దార్, హరిదేవ్ పూర్ కు చెందిన పూర్ణిమా కుందు, బెహలాకు చెందిన లాల్తీ డే ద్వారా ఆ చిన్నారిని కల్యాణి గుహకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు.
నలుగురు దళారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చేతులు మారడం వెనుక పెద్ద రాకెట్ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యవర్తులతో రూపాలీ, కల్యాణి ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఈ దందాలో మరెవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తల్లిని ప్రశ్నించగా అధికారులకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో సోమవారం ఉదయం మహిళను అరెస్టు చేయగా ఆమె నేరాన్ని అంగీకరించింది. రూపాలి పక్కింటి ప్రతిమా భున్యా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, సంరక్షణ) చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు సెక్షన్ 317 (పిల్లలను వదిలేయడం), 370 (వ్యక్తిని కొనడం, పారవేయడం), 372 (మైనర్ ను విక్రయించడం), 120 బీ(నేరపూరిత కుట్ర) కింద అభియోగాలు మోపారు.