
గుజరాత్లోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిను ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన మచ్చు నదిపై నిర్మించిన ఈ వంతెనకు మరమ్మత్తు పనుల అనంతరం గతేడాది అక్టోబర్లో తిరిగి ప్రారంభించారు. అయితే వంతెన ప్రారంభించిన నాలుగు రోజులకే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన ప్రాథమిక నివేదికను సమర్పించింది.
సస్పెన్షన్ బ్రిడ్జి వైర్లు దాదాపు సగానికిపైగా తుప్పు పట్టాయని.. మరమ్మత్తు సమయంలో పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్ చేశారని గుర్తించినట్టుగా సిట్ తన నివేదికలో పేర్కొంది. ఒరెవా గ్రూప్ చేపట్టిన మరమ్మత్తు పనుల్లో తీవ్ర లోపాలున్నాయని సిట్ గుర్తించింది. ‘‘అక్టోబరు 30వ తేదీ సాయంత్రం కేబుల్ తెగిపోకముందే ఒక కేబుల్ తుప్పుపట్టింది. దాదాపు సగం వైర్లు అప్పటికే విరిగిపోయి ఉండవచ్చు’’ అని పేర్కొంది.
‘‘49 వైర్లలో 22 తుప్పు పట్టినట్లు గమనించబడింది. సంఘటనకు ముందే ఆ వైర్లు తెగిపోయి ఉండవచ్చని సూచిస్తుంది. మిగిలిన 27 వైర్లు ఇటీవల విరిగిపోయాయి’’ అని నివేదిక పేర్కొంది. “పాత సస్పెండర్లు (కేబుల్ను ప్లాట్ఫారమ్ డెక్తో అనుసంధానించే స్టీల్ రాడ్లు) కొత్త సస్పెండర్లతో వెల్డింగ్ చేయబడ్డాయి. దీంతో సస్పెండర్ల ప్రవర్తన మారింది. ఈ రకమైన వంతెనలలో.. భారాన్ని మోయడానికి సింగిల్ రాడ్ సస్పెండర్లను ఉపయోగించాలి’’ సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఇక, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో.. ఐఏఎస్ అధికారి రాజ్కుమార్ బేనివాల్, ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సిట్లో సభ్యులుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. జనవరి చివరలో బ్రిడ్జి కూలిన కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఒరేవా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జైసుఖ్ పటేల్, మరో తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన సిట్ మరమ్మతు పనుల్లో పలు సమస్యలను గుర్తించింది. బ్రిడ్జిపై కదలికలను నియంత్రించకపోవడం, వంతెన మరమ్మతు పనుల్లో అనేక డిజైన్ లోపాలు కనిపించడంతో మున్సిపాలిటీని కూడా ఈ విషయంపై ప్రశ్నించారు. ఇక, ఒరెవా గ్రూప్ తమ అనుమతి లేకుండా బ్రిడ్జిని తిరిగి తెరిచారని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.