
తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేగింది. అవినీతి ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన సెంథిల్ బాలాజీ విషయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలాజీ మంత్రిగా కొనసాగుతారని.. కాకపోతే ఆయనకు ఎలాంటి పోర్ట్ఫోలియో వుండదని గవర్నర్ ఆర్ఎన్ రవికి సీఎం శుక్రవారం లేఖ రాశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే.. తమిళనాడులో రాజ్ భవన్ లో అర్ధరాత్రి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి పదవి నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్ ఎన్ రవి జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలిపి ఉంచారని విశ్వసీనయ వర్గాలు తెలిపాయని ‘జీ న్యూస్’ నివేదించింది. తదుపరి సమాచారం వచ్చే వరకు తొలగింపు ఉత్తర్వులను నిలిపివేయాలని గవర్నర్ అర్థరాత్రి నిర్ణయించారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కూడా తెలియజేశారని పేర్కొంది.
ALso Read: అర్ధరాత్రి అన్యూహ పరిణామాలు..సెంథిల్ బాలాజీ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమిళనాడు గవర్నర్
మనీలాండరింగ్ కేసులో నిందితుడైన వి.సెంథిల్ బాలాజీని గవర్నర్ తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ‘‘మంత్రి సెంథిల్ బాలాజీ ఉద్యోగాల కోసం నగదు తీసుకోవడం, మనీలాండరింగ్ సహా పలు అవినీతి కేసుల్లో తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించారు’’ అని తమిళనాడులోని రాజ్ భవన్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. రెండు వారాల క్రితం అరెస్టయిన బాలాజీ ప్రస్తుతం ఉద్యోగాలకు నోటు కేసులో జైలులో ఉన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆయనను శాఖ లేని మంత్రిగా కొనసాగించారు. ఈ నిర్ణయాన్ని గవర్నర్ రవి ఏకపక్షంగా రద్దు చేశారు.
గవర్నర్ పై సీఎం స్టాలిన్ ఫైర్
జైలులో ఉన్న మంత్రి సెంథిల్ బాలాజీని తొలగించడంపై గవర్నర్ ఆర్ఎన్ రవిపై విరుచుకుపడిన స్టాలిన్.. ఆయనకు అలా చేసే హక్కు లేదని, ఈ విషయంలో తమ ప్రభుత్వం చట్టపరంగా ముందుకెళ్తుందని అన్నారు. ‘‘గవర్నర్ కు (సిట్టింగ్ మంత్రిని తొలగించే) హక్కు లేదు. మేము దీనిని చట్టపరంగా ఎదుర్కొంటాము’’ అని అన్నారు.
గవర్నర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని, బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుకు, అది రూపొందించిన కాగితానికి కూడా విలువ లేదని డీఎంకే నేత ఎ.శరవణన్ ఆరోపించారు. ‘‘ గవర్నర్ ఎవరని అనుకుంటున్నారు? ఆయనకు (సెంథిల్ బాలాజీని తొలగించే) రాజ్యాంగబద్ధమైన అధికారం ఉందా? గవర్నర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఈ దేశ చట్టాన్ని సనాతన ధర్మం నిర్ణయించదు. గవర్నర్ కు రాజ్యాంగం బైబిల్, గీత, ఖురాన్ గా ఉండాలి. తన రాజకీయ యజమానులను ప్రసన్నం చేసుకునేందుకు విదూషకుడిలా వ్యవహరిస్తున్నారు. అతని ఉత్తర్వుకు అది రాసిన కాగితానికి కూడా విలువ లేదు. దాన్ని చెత్తబుట్టలో వేయాలి’’ అని డీఎంకే నేత వ్యాఖ్యానించారు.