Minor kills, robs senior citizen: తన ప్రియురాలి బెయిల్ కోసం ఓ మైనర్.. వృద్ధురాలిని హత్య చేశాడు. ఇప్పటికే ఒక కేసులో తన ప్రియురాలు జైలులో ఉండగా, ఆమె బెయిల్ కోసం పెద్దమొత్తంలో డబ్బు అవసరమైంది. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడైన మైనర్ డబ్బు కోసం వృద్ధురాలిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. పూణే పరిధిలోని పింప్రిలో 85 ఏళ్ల వృద్ధురాలి హత్య కేసులో 17 ఏళ్ల యువకుడిని పింప్రి-చించ్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో హత్యాయత్నం అభియోగాలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఓ యువతితో మైనర్ కు సంబంధం ఉందని పింప్రి పోలీసులు తెలిపారు. అయితే, ఆమెకు కోర్టు ఇచ్చిన బెయిల్ కు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో మరో నేరానికి పాల్పడి అవసరమైన నిధులను రాబట్టుకునేందుకు నిందితులు పథకం రచించారని పోలీసు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా జూలై 30న పింప్రికి చెందిన షాలుబాయి రూప సాల్వి అనే వృద్ధురాలి ఇంట్లోకి మైనర్ ప్రవేశించాడు. మైనర్ సీనియర్ సిటిజన్ పై అమానుషంగా దాడి చేయడంతో వృద్ధురాలు మరణించిందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు ఇంట్లోని బంగారు నగలు, మొబైల్ ఫోన్లను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. హత్యా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టగా గతంలో నేర కార్యకలాపాలకు పాల్పడిన మైనర్ హత్య తర్వాత పరారీలో ఉన్నట్లు గుర్తించారు. గాలింపు చర్యల్లో భాగంగా ఆగస్టు 7న పింప్రి మండై ప్రాంతంలో నిందితుడి ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. పింప్రి పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ రాజ్మానే మాట్లాడుతూ.. "నిందితుడు ఒక అమ్మాయితో సంబంధం కలిగి ఉన్నాడనీ, వారు కలిసి నివసిస్తున్నారని మేము దర్యాప్తులో కనుగొన్నాము. అయితే, ఇప్పటికే తన ప్రియురాలిని (లివ్ ఇన్ పార్టనర్) హత్యాయత్నం కేసులో అరెస్టు చేశారు. ఆమెకు బెయిల్ పొందడానికి అతనికి డబ్బు అవసరం. సులభంగా డబ్బు సంపాదించడానికి అతను వృద్ధురాలిని చంపి, ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడని" తెలిపారు.
ఈ క్రమంలోనే వృద్దురాలిపై దారుణంగా దాడి చేసి హత్య చేయడంతో పాటు దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ. 30,400 విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడినికి ఆగస్టు 9న (2023) నాటికి 18 ఏళ్లు నిండనున్నాయని దర్యాప్తు బృందం తెలిపింది. నిందితులు గతంలో పలు నిర్బంధ సైట్లలో పనిచేశారనీ, ఆన్ రికార్డ్ క్రిమినల్ అనీ, అతనిపై పింప్రి, శివాజీనగర్, ఎరవాడ పోలీస్ స్టేషన్లలో 11కు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. పింప్రి పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 392 (దోపిడీకి శిక్ష), 457 (ఇంటి అతిక్రమణ), 427 (అల్లరి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.