
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇప్పటికే గత మూడు రోజులుగా ఆయనను తీహార్ జైల్లో ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ క్రమంలో గురువారం సిసోడియాను అరెస్ట్ చేసినట్లుగా ఈడీ ప్రకటించింది. ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అంతకుముందు మార్చి 7న జరిగిన మొదటి విడత విచారణ సుమారు 5 గంటల పాటు సాగింది. సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీ స్థానిక కోర్టు అనుమతి పొందింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తీహార్ జైలులోని సెల్ నంబర్ 1లో ఈడీ ఆయనను ప్రశ్నించింది. 2021-22 సంవత్సరంలో తీసుకవచ్చిన, ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవినీతికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఫిబ్రవరి 26 న సిసోడియాను అరెస్టు చేసింది.
రెండో విడత విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను మార్చడం, వాటిని నాశనం చేయడం వంటి అభియోగాలకు సంబంధించి ఆయనను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ మంత్రిగా ఆయన అనుసరించిన విధాన నిర్ణయాలు, వివిధ క్రమాల్లో తీసుకున్న చర్యల గురించి కూడా ఈడీ ఆయనను ప్రశ్నించినట్లుగా సమాచారం.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం..
ఢిల్లీ ప్రభుత్వం 2021-2022 ఎక్సైజ్ పాలసీ ద్వారా లంచాలు ఇచ్చిన కొంతమంది డీలర్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ విధానాన్ని రద్దు చేసిన తర్వాత ఢిల్లీ ఎల్జీ దీనిపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆప్ నేతలపై ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదుచేసింది. ఇందులో సిసోడియాతో సహా ఇతరులను నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదు దాఖలైన తర్వాత, మనీష్ సిసోడియా, కొంతమంది ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నివాసాలపై సీబీఐ దాడులు చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీబీఐ దర్యాప్తును కోరడంతో ఎక్సైజ్ ప్రణాళిక పరిశీలనలోకి వచ్చింది. దీంతో పాటు 11 మంది ఎక్సైజ్ అధికారులను ఎల్జీ సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా విచారణకు తమ ముందు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.