
న్యూఢిల్లీ: బిహార్లో బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకుని ప్రతిపక్షంలోని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూకు నాగాల్యాండ్లో ఎదురుదెబ్బ తగిలింది. నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీపీపీ, బీజేపీ కూటమికి మెజార్టీ సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు నాగాల్యాండ్ జేడీయూ చీఫ్ సెంచుమో ఎన్ఎస్ఎన్ లోథా లేఖ అందించారు. ఇది పార్టీలో దుమారం రేపింది. జేడీయూ సెంట్రల్ లీడర్షిప్ వెంటనే రంగంలోకి దిగింది. నాగాల్యాండ్ జేడీయూ రాష్ట్ర కమిటీనే రద్దు చేసేసింది.
పార్టీ కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరపకుండానే నాగాల్యాండ్ జేడీయూ చీఫ్ ఎన్డీపీపీ, బీజేపీ ప్రభుత్వానికి మద్దతు లేఖ అందించారని నాగాల్యాండ్ జేడీయూ జనరల్ సెక్రెటరీ అఫిక్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఇది తీవ్రమైన ఉల్లంఘన అని, క్రమశిక్షణారాహిత్యం అని పేర్కొన్నారు. అందుకే పార్టీ.. నాగాల్యాండ్ జేడీయూ రాష్ట్ర కమిటీని తక్షణమే రద్దు చేసే నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: ఆ విషయంలో మేడమ్ సోనియాకు సెల్యూట్ అన్న కవిత.. విపక్షాల ఐక్యతపై ఏం చెప్పారంటే..
బీజేపీ ప్రతిపక్ష రహిత రాజకీయాలు చేయాలని కలలు కంటున్నదని జేడీయూ ప్రతినిధి సునీల్ సింగ్ ఆరోపించారు. ఈ స్థితి దేశవ్యాప్తంగా ఉండాలని భావిస్తున్నదని తెలిపారు. అందుకోసమే నాగాల్యాండ్ జేడీయూ చీఫ్ లోథాను లోబరుచుకున్నారని ఆరోపించారు. నాగాల్యాండ్లో ప్రతిపక్ష రహిత రాజకీయాలకు తెర తీసిందని వివరించారు. ఇదే స్థితి దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నదని తెలిపారు.