
India's second 'Bharata Mata Temple' built in Mangalore: దేశంలో రెండో భారత మాత ఆలయం ఏర్పాటైంది. దీనిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న భారత మాత ఆలయం తర్వాత దేశంలో ఇది రెండవ ఆలయంగా నిలిచింది.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని ఈశ్వరమంగళలోని అమరగిరిలో భారత మాత ఆలయాన్ని హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా శనివారం ప్రారంభించారు. పుత్తూరు పట్టణంలోని సెంట్రల్ అరెకానట్ అండ్ కోకో మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్యాంప్కో) స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి షా కర్ణాటకకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన దేశంలో రెండో భారత మాత ఆలయాన్ని ప్రారంభించారు.
3 కోట్లతో భారత మాత ఆలయ నిర్మాణం
భారత మాత ఆలయాన్ని ధర్మశ్రీ ప్రతిష్ఠాన్ ట్రస్ట్ 3 కోట్ల రూపాయలతో నిర్మించింది. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న భారత మాత ఆలయం తర్వాత దేశంలో ఇది రెండవ ఆలయంగా గుర్తింపును సాధించింది. ఫౌండేషన్కు చెందిన 2.5 ఎకరాల స్థలంలో ఆలయాన్ని నిర్మించినట్లు ఫౌండేషన్ పరిపాలనా దాత అచ్యుత్ మూడేత్తయ్య తెలిపారు. భారతమాత గొప్ప యోధుల పట్ల ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే ఆలయ లక్ష్యమని తెలిపారు.
అమిత్ షా వెంట పలువురు సీనియర్ నాయకులు..
పుత్తూరు తాలూకాలోని ఈశ్వరమంగళలోని అమరగిరిలో భారత మాత ఆలయాన్ని అమిత్ షా ప్రారంభించగా, ఆయన వెంట పలువురు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఆలయంలో ఆరు అడుగుల ఎత్తైన భారత మాత విగ్రహం, మూడు అడుగుల ఎత్తున్న సైనికులు, రైతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతకుముందు హనుమగిరిలోని శ్రీ పంచముఖి ఆంజనేయ ఆలయాన్ని షా సందర్శించారు. ఆయన వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, ఎంపీలు ఉన్నారు.
రాష్ట్రంలో సుభిక్ష పాలన అందిస్తున్నాం..
18వ శతాబ్దానికి చెందిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ను కాంగ్రెస్, జేడీఎస్ నమ్ముకున్నాయని, ఆ రెండు పార్టీలు కర్ణాటకకు ఎలాంటి మేలు చేయలేవనీ, 16వ శతాబ్దానికి చెందిన ఉల్లాల్ రాణి అబ్బక్క చౌటాకు చెందిన తుళు రాణి స్ఫూర్తితో రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగిస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. కాంగ్రెస్ అవినీతిమయమైందనీ, ప్రతిపక్ష పార్టీ కర్ణాటకను గాంధీ కుటుంబానికి ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం)గా ఉపయోగించుకుందని అమిత్ షా ఆరోపించారు.