
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను ఆమె భర్త విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే, ఈ సంఘటన జరిగి కొద్ది రోజులు అయ్యాక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిమీద పోలీసులకు ఫిర్యాదు అందింది.
22 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్లో కుసుమ దేవి అనే మహిళ భర్త శాయంబిహారి ఆమెను స్తంభానికి కట్టేసి కొట్టడం, తర్వాత ఆమెను విడదీసి తాడుతో వెనుకకు లాగడం కనిపిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన జూలై 14న ఆగ్రాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సేనా గ్రామంలో జరిగింది. అయితే దాడిచేసిన వ్యక్తి, అతని తల్లి మీద అదే రోజు కేసు నమోదు చేయబడింది. అయితే, అప్పటి నుండి, నిందితులిద్దరూ అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు.
ప్రాణం మీదికి తెచ్చిన ‘ఐ లైక్ యూ’ మెసేజ్.. పోలీసులు చెప్పిన సమాధానం వేరే లెవల్.. అసలేం జరిగిందంటే..
"ఈ సంఘటన జూలై 14న ఆగ్రాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సేనా గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కనిపించింది" అని సికంద్రా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ షాహి తెలిపారు. "వీడియోలో ఉన్న వ్యక్తిని బాధితురాలు కుసుమా దేవి భర్త శ్యాంబిహారిగా గుర్తించారు" అని అతను చెప్పాడు.
శ్యాంబిహారి, అతని తల్లి బర్ఫా దేవిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 342 (తప్పుగా నిర్బంధించడం), 354ల కింద కేసు నమోదు చేసినట్లు షాహి తెలిపారు. జూలై 14న తన భర్త, అత్త తనను కొట్టారని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బెదిరించారని కుసుమా దేవి తన ఫిర్యాదులో పేర్కొంది. "నేను పోలీసులను ఆశ్రయించానని తెలియగానే, నా భర్త నన్ను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టాడు, ఈ సంఘటన వీడియోను ఇరుగుపొరుగు వారు రికార్డ్ చేసారు" అని ఆమె చెప్పింది.