పోలీసుల "గులాబీ" కార్యక్రమం.. భార్య అనుమానం.. కాపురంలో చిచ్చు

First Published Jul 28, 2018, 10:53 AM IST
Highlights

పోలీసులంటే ఇదివరకటి రోజుల్లోలా కరకుగా ఉండటం లేదు.. నేరస్థులతో పాటు ప్రజలతో వ్యవహిరించే విధానంలోనూ మార్పు వచ్చింది. నొప్పించకుండా ఒప్పించేందుకు విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వినూత్న ప్రయోగమే ఓ కాపురంలో చిచ్చుపెట్టింది

పోలీసులంటే ఇదివరకటి రోజుల్లోలా కరకుగా ఉండటం లేదు.. నేరస్థులతో పాటు ప్రజలతో వ్యవహిరించే విధానంలోనూ మార్పు వచ్చింది. నొప్పించకుండా ఒప్పించేందుకు విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వినూత్న ప్రయోగమే ఓ కాపురంలో చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళితే.. చట్టంలో పేర్కొన్న నిబంధనలను మీరి దురుసుగా వ్యవహరించేవారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు.. తాము చెప్పింది తూచా తప్పకుండా పాటించేవారిని అభినందిస్తున్నారు లక్నో పోలీసులు..

దీనిలో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారికి భారీ జరిమానాలు విధిస్తూ.. హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడకుండా వస్తున్న వాహనదారులను అభినందిస్తూ.. వారికి ఓ గులాబీ పువ్వును ఇస్తున్నారు. ఈ క్రమంలో సికిందర్ అనే యువకుడు హెల్మెట్ ధరించి వెళ్తుండటంతో అతడిని ఆపి చేతిలో ఎర్రగులాబి పెట్టారు పోలీసులు. ఇంటికి వెళ్ళి బైక్ పార్క్ చేసి భార్య ఇచ్చిన కాఫీ తాగి సోఫాలో కూర్చాన్నాడు సికిందర్.

ఈ క్రమంలో భార్య బండిని తుడుస్తుండగా రోజా పువ్వును చూసి ఆశ్చర్యపోయింది. పెళ్లయిన నీకు గులాబీ పువ్వు ఎందుకు..? ఎవరైనా ఇచ్చారా..? లేక ఎవరికైనా ఇవ్వడానికి తెచ్చావా..? అంటూ సికిందర్‌పై ప్రశ్నల వర్షం  కురిపించింది. అతను జరిగినదంతా చెప్పినా వినే పరిస్థితుల్లో ఆమె లేకపోగా.. తన భర్త తనను కాదని వేరే మహిళలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ విలపించింది.

దీంతో ఆ యువకుడు వెంటనే పోలీసుల దగ్గరకు పరిగెత్తి విషయం చెప్పాడు.. అతని పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు అతనికి పువ్వు ఇస్తుండగా తీసిన ఫోటోను ఇచ్చారు.. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్లి భార్యకు చూపించడంతో ఆమె ఒక నవ్వు నవ్వి భర్తను దగ్గరకు తీసుకుంది.. దీంతో కథ సుఖాంతమైంది.

click me!