
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడిని హతమార్చి, పాము కాటుతో చనిపోయాడని కలరింగ్ ఇవ్వాలనుకున్నాడు. దీనికోసం మృతదేహం పక్కన చనిపోయిన నాగుపామును పడేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రాజేష్ సింగ్ భదౌరియా తెలిపిన వివరాల్లోకి వెడితే... మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృతుడి స్నేహితుడు సందీప్ బాగ్మారే ఇంట్లో బస్సు డ్రైవర్ నవల్ సింగ్ మృతదేహం లభ్యమైంది. అంతేకాదు “శవం పక్కన చనిపోయిన నాగుపాము కూడా పడి ఉంది. సింగ్, అతని స్నేహితులు రాత్రిపూట కలిసి మద్యం సేవించారని బాగ్మారే చెప్పారు ”అని భదౌరియా చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..,బాగ్మరే, సింగ్ కలిసి మద్యం సేవించిన తరువాత.. రాత్రి బాగా ఆలస్యం కావడంతో బాగ్మారే తన ఇంట్లో పడుకోమని సింగ్ ను కోరాడు. అయితే, మరుసటి రోజు ఉదయం, బాగ్మారే తన స్నేహితుడు చనిపోయాడని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన బాగ్మారే ఇంటికి చేరుకున్నారు. అక్కడ వారికి మృతదేహం దగ్గర చనిపోయిన నాగుపాము పడి ఉండటాన్ని వారు గమనించారు. దీని కారణంగా సింగ్ రాత్రిపూట పడుకున్నప్పుడు పాము కరవడం వల్ల మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానించారు.
వానదేవుడి కరుణ కోసం.. బీజేపీ ఎమ్మెల్యేకు బురదతో స్నానం.. ఉత్తరప్రదేశ్ లో విచిత్రం...
అయితే, కేసు దర్యాప్తులో భాగంగా, మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ రిపోర్టులో మృతుడు పాము కాటు కారణంగా సింగ్ మరణించలేదని పోలీసులకు తెలిపింది. సింగ్ మృతికి పాము కాటు విషయం కారణం కాదని తెలిసింది. “మరణించిన వ్యక్తి శరీరంలో విషం లేదు. శరీరంపై పాము కాటుకు సంబంధించిన సంకేతాలు లేవు. నావల్ సింగ్ ఊపిరాడక చనిపోయాడని షార్ట్ పీఎం నివేదిక వెల్లడించింది'' అని భదౌరియా తెలిపారు.
దీంతో అనుమానంతో బాగ్మారేను పోలీసులు ప్రశ్నించారు. అయితే, మొదట నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత సింగ్ నోటికి, ముక్కుకు గుడ్డ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగ్మారే ఒంటరిగా ఈ హత్య చేశాడా లేక మరెవరితో కలిసి చేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.