దారుణం .. నడిరోడ్డులో భార్యను చంపి.. శవాన్ని స్కూటీ మీద వేసుకుని..

By AN TeluguFirst Published Nov 2, 2020, 4:37 PM IST
Highlights

అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను చంపడమే కాకుండా.. బండిమీద వేసుకుని తీసుకెళ్లిన దారుణ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన వివరాల్లోకి వెడితే..

అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను చంపడమే కాకుండా.. బండిమీద వేసుకుని తీసుకెళ్లిన దారుణ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన వివరాల్లోకి వెడితే..

రాజ్‌కోట్‌ పలితాన సమీపంలోని ఓ గ్రామంలో తాళి కట్టిన భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేసి.. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీ మీద వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతగాడిని పోలీసులకు అప్పగించారు.

వెరవాల్‌ గ్రామం సింధ్‌ క్యాంప్‌ కాలనీకి చెందిన హేమ్‌నాని, నైనా దంపతులకు గత ఏడాది వివాహం అయింది. హేమ్‌నాని స్థానిక ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఆదివారం చిన్న గొడవ మొదలయ్యింది. దాంతో హేమ్‌నాని ఆగ్రహంతో భార్య గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని స్కూటీ మీద వేసుకుని రోహిషాల గ్రామం వైపు వెళ్లసాగాడు. స్టీరింగ్‌, ఫూట్‌ రెస్ట్‌కి మధ్య నైనా మృతదేహాన్ని ఉంచాడు. దాంతో ఆమె కాళ్లు నేల మీద ఉన్నాయి. ఇదేం పట్టించుకోకుండా అలానే ఓ 10 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు.

ఇది గమనించిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. స్కూటీని ఆపాల్సిందిగా అరిచారు. కానీ హేమ్‌నాని ఇదే పట్టించుకోకుండా అలానే ముందుకు వెళ్లాడు. దాంతో స్థానికులు తమ వాహనాల మీద అతడి వెనకే వెళ్లి.. పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

దీనిమీద పాలితాన ఎస్సై మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో నిందితుడు తన భార్య శవాన్ని పాలితాన తాలూకాలోని రోహిషాల గ్రామం చివర ఉన్న అటవి ప్రాంతంలో పడేయాలని భావించినట్లు తెలిపాడు. ఇక తన భార్యను హత్య చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇరువురు కుటుంబ సభ్యులను విచారిస్తే.. హత్య చేయడానికి గల కారణాలు తెలుస్తాయి’ అన్నారు.

click me!