
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ నేత ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కి సుప్రీంకోర్టు ఊరట లభించింది.
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితా నుండి కమల్ నాథ్ పేరును తొలగిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకొన్న నిర్ణయంపై సుప్రీంకోర్టు సోమవారం నాడు స్టే జారీ చేసింది.
ఈ విషయమై ఈసీకి అధికారం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఇమ్రతీదేవిని ఉద్దేశించి కమల్ నాథ్ ఐటమ్ గా అభివర్ణించారరు.
ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది.మాజీ సీఎం కమల్ నాథ్ వ్యాఖ్యలపై బీజేపీ ఈసీని ఆశ్రయించింది. దీంతో కమల్ నాథ్ పేరును కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ను జాబితా నుండి తొలగించింది.
ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కమల్ నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈసీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కమల్ నాథ్ తరపున సుప్రీంకోర్టులో వాదించారు. ఈ విషయమై స్పందనను దాఖలు చేయాలని ఈసీని కోర్టు ఆదేశించింది.