
కన్నబిడ్డలకు కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. వారి ప్రాణాలను తీశాడు. ముగ్గురు కూతుళ్లను రైలు ముందుకు తోసి.. ఆ తర్వాత తాను కూడా దూకాడు. ఈ ఘటనలో ముగ్గురు కూతుళ్లతో పాటు తండ్రి కూడా చనిపోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని నైఖేడి స్టేషన్ సమీపంలో చోటుచేసకుంది. ఘటన స్థలానికి కొద్ది దూరంలో మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని ఉజ్జయినికి చెందిన రవి పంచల్గా గుర్తించారు. అయితే ఈ ఘటనకు రవికి ఉన్న వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వివరాలు.. ఉజ్జయిని నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోయ్లా బుజుర్గ్ గ్రామంలో రవి నివాసం ఉంటున్నాడు. అతను కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. చిమంగంజ్ ప్రాంతంలో భార్య, కూతుళ్లతో కలిసి నివాసముంటున్నాడు. అతడు బుధవారం తన కూతుళ్లు ఆరాధ్య (9), అనుష్క (11), అనామిక (16).. స్కూల్ వద్ద దింపుతానని ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అయితే అతడు వారిని నైఖేడి వైపుకు తీసుకెళ్లాడు. అక్కడ పిల్లలను చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించినట్లు జీఆర్పీ ఇన్స్పెక్టర్ రాధేశ్యామ్ మహాజన్ తెలిపారు. ప్రస్తుతం రవి కుటుంబం షాక్లో ఉండిపోయిందని.. దీంతో తాము ప్రస్తుతం వారి నుంచి వివరాలు సేకరించలేకపోయామని రైల్వే పోలీసులు చెప్పారు. అయితే రవి జేబులో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకన్నట్టుగా తెలిపారు. ఆ నోట్లొని వివరాలు అతనికి అక్రమ సంబంధం ఉందని సూచిస్తున్నాయని చెప్పారు.
‘‘రవి ఒక మహిళతో పారిపోయి రెండు రోజులు ఇంటికి దూరంగా ఉన్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఇంటికి తిరిగి రాగానే కుటుంబ సభ్యుల అతనిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. భార్య కుటుంబీకులు పంచాయితీ పెట్టించి రవిని మందలించారు. అయితే రవి సూసైడ్ నోట్లో అతని అత్తమామల పేర్లను ప్రస్తావించాడు’’ అని జీఆర్పీ ఎస్పీ నివేదిత గుప్తా తెలిపారు.