ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన ఓ భార్య పిల్లలకు టీలో విషం కలిపించి హతమార్చింది.
లక్నో : కుటుంబకలహాల్లో అభంశుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలకు పిల్నల్లి బలి చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి ఓ దారుణ విషాద ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడిన ఓ భార్య తన కోపాన్ని ముగ్గురు పిల్లల మీద చూపించింది. దీంతో ముగ్గురు చిన్నారులు అకారణంగా, అకాల మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లో జరిగింది. భర్త అత్తింటివారితో గొడవ పడిన సునీత యాదవ్ తన నలుగురు సంతానాన్ని తీసుకొని వారం రోజుల క్రితమే దంధాని గ్రామంలోని పుట్టింటికి వచ్చేసింది.
సునీతకు, ఆమె భర్తకు రెండు రోజుల క్రితం ఫోన్ లో మళ్ళీ గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత తన ముగ్గురు సంతానానికి తేనీరులో విషపదార్థం కలిపి ఇచ్చింది. ఫలితంగా తీవ్ర అనారోగ్యం పాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. విషం కలిపిన టీ తాగడంతో హిమాన్షు యాదవ్ (10), పీయూష్ యాదవ్ (8), సుప్రియ (5) మరణించినట్లు స్థానిక ఎస్పీ రోహన్ ప్రసాద్ వెల్లడించారు. నాలుగో కుమారుడు బయట ఆడుకుంటుండంతో అతడికి తల్లి విషం కలిపిన ఆ టీని ఇవ్వలేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యూనిఫాంలో యూపీ పోలీసుల నాగిని డ్యాన్స్.. ఇంటర్నెట్ లో వైరల్..
కాగా, ఆగస్ట్ 12న ఇలాంటి దారుణ ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది. ఇంట్లో అల్లరి చేస్తోందని ఆగ్రహించిన తల్లి కన్న కూతురి మీద కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే,,, తిరువణ్ణామలై సమీపంలోని అరట్టపట్టు గ్రామానికి చెందిన భూపాలన్ కూలీ కార్మికుడు. ఇతని భార్య సుకన్య. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రసన్నదేవ్, రితిక (06) ఉన్నారు. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు చదువుకుంటున్నారు. సుకన్య, భూపాలన్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో సుకన్య పిల్లలను తీసుకొని అమ్మగారింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. గత మంగళవారం ప్రభుత్వ సెలవు కావడంతో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు.
అల్లరి చెయ్యొద్దని ఎన్నిసార్లు సర్ది చెప్పినా పిల్లలు వినలేదు. దీంతో కోపానికి వచ్చిన సుకన్య ఇంట్లో ఉన్న కర్రతో రితిక తల మీద కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది. అది గమనించిన సుకన్య వెంటనే చిన్నారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దహనక్రియలు చేసేందుకు అమ్మగారి ఇంటికి తీసుకు వెళ్ళింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భూపాలన్ కు సమాచారం అందించారు. భూపాలన్ తిరువన్నామలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తల్లి సుకన్యను అరెస్టు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.