రైలు పట్టాలపై కూర్చుని ప్రేమ కబుర్లు.. ట్రైన్ ఢీ కొట్టడంతో ప్రేమ జంట మృతి..

By SumaBala BukkaFirst Published Dec 9, 2022, 10:02 AM IST
Highlights

ట్రైన్ ఢీ కొని ప్రేమజంట మృత్యువాత పడ్డ ఘటన చెన్నైలో విషాదం నెలకొంది. వేగంగా వస్తున్న ట్రైన్ ను గమనించకపోవడంతో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. 

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట రైలు పట్టాలపై కూర్చుని మాట్లాడుకుంటోంది. వేగంగా వస్తున్న రైలును గమనించలేదు. ఆ రైలు ఢీ కొని వారిద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానిక తాంబరం సమీపంలోని మరమలైనగర్ లో జరిగింది. రైల్వై పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుంది దర్యాప్తు చేస్తున్నారు. 

మృతులను అలెక్స్ (24), షెర్లిన్ (20)గా గుర్తించారు. వీరిద్దరూ మరమలైనగర్ లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా సింగపెరుమాళ్ ఆలయం దగ్గర్లో.. వేర్వేరుగా గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అలెక్స్ కడలూరు జిల్లాకు చెందినవాడు కాగా, షెర్లిన్ తూత్తుకుడి జిల్లాకు చెందింది. వీరిద్దరూ పనిచేసే క్రమంలో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకు వీరి కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాలనుకున్నారు. వారి ఆశీర్వాదంతో ఒక్కటవ్వాలనుకున్నారు. 

బుధవారం రాత్రి మరమలైనగర్ ప్రాంతంలో కలుసుకోవాలనుకున్నారు. అక్కడ రైలు పట్టాల మీద కూర్చుని ప్రేమ కబుర్లలో పడ్డారు. అయితే, ఆ సమయంలో ఎగ్మూర్ నుంచి ఎక్స్ ప్రెస్ రైలు వస్తుంది. ఇది గమనించిన వీరిద్దరూ తప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ అంతలోనే రైలు వేగంగా వచ్చింది. ఇద్దరినీ ఢీ కొట్టింది. దీంతో ప్రేమజంట అక్కడికక్కడే మృతి చెందారు. 

పెళ్లి చేసుకోమన్నందుకు.. కత్తితో యువకుడిపై దాడి చేసిన యువతి..!

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందండంతో వెంటనే చెంగల్పట్టు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పట్టాలపై పడి ఉన్న ఇద్దరి మృతదేహాలను చెంగల్పట్లు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అయితే, వీరిద్దరూ ప్రమాదవశాత్తు మరణించారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

click me!