పాడుబడ్డ ఇంటిలో బంగారు నాణేలు.. రూ. 1.25 కోట్లు విలువైన 86 కాయిన్స్ లభ్యం.. ఆ లేబర్ నుంచి సమాచారం లీక్

By Mahesh KFirst Published Aug 29, 2022, 7:48 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో శిథిలమైన ఓ పాడుబడ్డ ఇంటిలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆ ఇంటిని పునర్నిర్మిద్దామని కార్మికులను పనికి పంపగా.. వారికి ఈ నాణేలు దొరికాయి. తొలుత వారు పంచుకోవాలని అనుకున్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారిని అరెస్టు చేశారు. నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
 

భోపాల్: గుప్త నిధుల అన్వేషణ గురించి మనం కథల్లో వింటాం. కొన్నిసార్లు ఈ చర్చను నిజంగా కూడా వింటూ ఉంటాం. నిజంగా గుప్త నిధుల కోసం అన్వేషణలు వర్తమానంలో జరుగుతున్నాయో లేదో తెలియదు కానీ.. కొందరు కార్మికులకు ఎలాంటి కష్టం లేకుండా మరెలాంటి ప్రయత్నం లేకుండా నిధులు అందివచ్చాయి. అప్రయత్నంగానే అదీ.. ఓ పాడుబడ్డ ఇంటిలో గుప్తంగా ఉన్న బంగారు నిధులు వారి చేతికి అందాయి. పాడుబడ్డ ఇంటిలో ఏముంటుంది అని వారూ అనుకున్నారు. కాబట్టే.. నిధుల ఆలోచనలేవీ లేకుండా కేవలం ఆ ఇంటి పునర్నిర్మాణం కోసం పని చేస్తున్నారు. వారెవ్వరూ ఊహించని రీతిలో ఆ శిథిలమైన నివాసంలోనే రూ. 1.25 కోట్ల విలువైన 86 బంగారు నాణేలు వారి కంట పడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో ఇది వెలుగు చూసింది.

అదనపు ఎస్పీ దేవేంద్ర పాటిదార్ వివరాల ప్రకారం, ధర్ జిల్లాలో ఓ పాడుబడ్డ ఇంటిని పునర్నిర్మించాలని ఆ ఇంటి యజమాని భావించాడు. ఇందులో భాగంగా చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాలను తొలగించడానికి ఎనిమిది కార్మికులను పనికి మాట్లాడాడు. వారు ఆ ఇంటిలో చెత్తను తీసివేస్తుండగా పురాతనమైన 86 బంగారు నాణేలు లభించాయి. వాటిని చూడగానే వారి కళ్లు మెరిసిపోయాయి. 

ఈ నిధుల గురించి బయట ఎవరికీ చెప్పకుండా వారిలో వారు పంచుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే కొన్ని రోజులపాటు ఆ విషయం బయట ఎవరికీ తెలియలేదు. అయితే, ఆ ఎనిమిది మందిలో ఒక కార్మికుడు మద్యపానం సేవించి మత్తులో ఈ బంగారు నాణేల గురించి బయట వాగాడు. తాను ఓ నాణేన్ని రూ. 56 వేలకు అమ్మేశానని గొప్పలకు పోయాడు. తద్వార ఇంటి ఖర్చులన్నీ తీర్చుకుని సెకండ్ హ్యాండ్‌లో ఓ ఫోన్ కొనుక్కున్నానని వివరించాడు. కానీ, తాను తాగిన మత్తులో మాట్లాడిన విషయం పోలీసుల దాకా
వెళ్లుతుందని అప్పుడు ఆ లేబర్ అనుకోలేదు.

A treasure trove of antique gold coins, a metallic urn, a piece of gold, and old gold jewellery was unearthed during the reconstruction of a dilapidated house in Dhar pic.twitter.com/gLoLR1lwU9

— Anurag Dwary (@Anurag_Dwary)

ఈ విషయం తెలియగానే వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్మికులను అరెస్టు చేశారు. వారి నుంచి ఇప్పటి వరకు 86 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ బంగారు నాణేల గురించి ఇంటి యజమానికి తెలియదు. తన పురాతన ఇంటిలో నాణేలు దాగి ఉన్నాయనే విషయం ఆయన ఎరుకలో లేదు. స్వాధీనం చేసుకున్న ఆ బంగారు వస్తువుల మార్కెట్ విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఇవి పురాతనమైనవి కాబట్టి, ఆర్కియలాజికల్ విలువ సుమారు రూ. 1.25 కోట్లు పలుకుతుందని వివరించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతంలో ఈ విషయం సంచలనంగా మారింది.

click me!