
కోల్కతా: విదేశాల నుండి విమానమార్గంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ భారత్ లోని అనేక విమానాశ్రాయాల్లో స్మగ్లర్లు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. దీంతో స్మగ్లర్లు తమ పంథాను మార్చుకుని నయా స్టైల్లో స్మగ్లింగ్ మొదలెట్టారు. భారత్ పొరుగుదేశాల నుండి రోడ్డుమార్గంలో బంగారాన్ని తరలించడం ప్రారంభించారు. ఇలా బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ కు అక్రమంగా తరలిస్తున్న కోట్ల విలువచేసే బంగారం పట్టుబడింది.
బంగ్లాదేశ్ నుండి బార్డర్ దాటిన కిలోల కొద్ది బంగారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు సమాచారం అందింది. దీంతో సింథిమూర్ సిటీలో మాటువేసిన అధికారులు అనుమానాస్పదంగా కనిపించే వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఓ వాహనంలో కిలోల కొద్ది బంగారం పట్టుబడింది. ఈ బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు బంగారంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు.
పట్టుబబడిన బంగారం విలువ దాదాపు రూ.3కోట్లు వుంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడ్డ వారిలో కోల్కతాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య వున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ లోని లక్నో విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. రియాద్ ప్రయాణీకుల వద్ద రూ.35లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారు బిస్కెట్లను జీన్స్ ప్యాంటు జోబుల్లో, లోదుస్తులల్లో దాచి తరలించేందుకు యత్నించారు. అయినప్పటికి కస్టమ్స్ అధికారుల తనిఖీలల్లో అక్రమ బంగారం బయటపడింది. దీంతో బంగారాన్ని సీజ్ చేసి ఇద్దరు ప్రయాణీకులను అరెస్ట్ చేశారు.