
లక్నో : మూఢనమ్మకం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఆలోచనను చంపేస్తుంది. తప్పు, ఒప్పులను గుర్తించనియ్యదు. ప్రమాదకరమైన, ప్రాణాపాయంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి పురిగొలుపుతుంది. దీంతో ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఓ హృదయవిదారక ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
సాధారణంగా గ్రామదేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. కానీ ఓ యువతి ఏకంగా తనను తానే బలిచ్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో కలకలం రేపింది. ఇక ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మీరట్ జిల్లా ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని నిత్యం ఎంతో ఇష్టంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేది.
భక్తిపారవశ్యంతో కాళీమాత ఆలయానికి ప్రతి రోజు వెళ్ళేది. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఆ యువతి తనను తాను కాళీమాత కుమార్తెగా భావించడం మొదలు పెట్టింది. తాను మహా భద్రకాళి కూతురునని అమ్మ వారి కోసం తన ప్రాణం త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఇదే క్రమంలో ఆ యువతి ఒంటరిగా ఓ రోజు తెల్లవారుజామున అడవిలోని ఆలయానికి వెళ్ళింది.
అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేరు. ప్రతిరోజు పూజారి కూడా సాయంత్రం వచ్చి అమ్మవారికి పూజ చేసి వెళ్ళిపోయేవాడు. అయితే ఆ రోజు యువతి చాలాసేపు పూజ చేసిన తర్వాత ఊహించని నిర్ణయం తీసుకుంది. తొలుత గొంతు కోసుకుని రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది.
గొంతుమీద కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరితాడు బిగించుకుని ప్రాణత్యాగానికి పాల్పడింది. అయితే రోజు లాగానే ఆ రోజు సాయంత్రం ఆలయానికి వచ్చిన పూజారి అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. గంటలకు వేలాడుతూ యువతి విగతజీవిగా కనిపించడంతో అయోమయం, ఆందోళనకు గురయ్యాడు. కొంతసేపటికి తేరుకుని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
జమ్మూకశ్మీర్ : రెచ్చిపోయిన ఉగ్రవాదులు .. అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ హత్య
అయితే ఆ యువతి మూఢ విశ్వాసాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానీ, ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గ్రామంలోని కొందరు ఆ యువతి మూఢనమ్మకాల కారణంగానే తనను తాను బలిచ్చుకుందని అనుకుంటుంటే... మరికొందరు మాత్రం కుటుంబ సమస్యల వల్లే ఉరేసుకుని చనిపోయింది అని చెబుతున్నారు.
ఏ విషయంలోనో అదే రోజు కుటుంబ సభ్యులకు, ఆ యువతికి మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువతి ఆలయానికి వెళ్లి ఉరేసుకుని ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతికి అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.