
కేరళలోని ఇడుక్కి జిల్లాలో (Idukki district) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న 27 ఏళ్ల మహిళ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు సంబంధించి ఓ పోలీసును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. షీబా ఏంజెల్ రాణి అలియాస్ స్వప్న.. మున్నార్లోని దేవికులం ప్రభుత్వ పాఠశాలలో కౌన్సెలర్గా పనిచేస్తున్నారు. అయితే ఆమె డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి స్వప్న మృతిచెందింది.
ఈ ఘటనకు సంబంధించి స్వప్న తండ్రి ఇడుక్కి ఎస్పీ కురుప్పసామికి ఫిర్యాదు చేశారు. తన కూతురు ఆత్మహత్యకు శాంతన్పారా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సీపీవో శ్యామ్ కుమార్ కారణమని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎస్పీ.. ఇడుక్కి నార్కొటిక్ సెల్ డిప్యూటీ ఎస్పీ ఏజీ లాల్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే వారు సమర్పించిన ప్రాథామిక విచారణ రిపోర్ట్ ఆధారంగా శ్యామ్ కుమార్ను సస్పెండ్ చేశారు.
‘శ్యామ్ కుమార్కు ఇది వరకే పెళ్లి జరిగింది. ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతడు మున్నార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో స్వప్నతో పరిచయం పెంచుకున్నారు. తర్వాత ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే స్వప్న తండ్రి ఫిర్యాదు మేరకు.. ఉన్నతాధికారులు శ్యామ్ కుమార్ను హెచ్చరించారు. అలాగే అతడిని శాంతన్పారా పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. అయినప్పటికీ శ్యామ్ కుమార్ తన తీరు మార్చుకులేదు. తాను విడాకులు తీసుకున్నట్టుగా అబద్దం చెప్పిన శ్యామ్ కుమార్.. స్వప్నను నమ్మించి ఆమెతో రిలేషన్ కొనసాగించాడు. అంతేకాకుండా స్వప్నను పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీలు ఇచ్చాడు.
అయితే శ్యామ్ కుమార్ విడాకులు తీసుకోలేదని ఇటీవల స్వప్నకు తెలిసింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న స్వప్న తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మహిళ మృతికి సంబంధించి సీపీవో శ్యామ్ కుమార్పై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. ఆధారాల సేకరణ, విచారణ కొనసాగుతుంది. ఒకవేళ అవసరమని భావిస్తే శ్యామ్ కుమార్పై కేసు నమోదు చేస్తాం’ అని ఏజీ లాల్ తెలిపారు.