
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీఎం, డిప్యూటీ సీఎం పోస్టులపై నాలుగు రోజులపాటు ఢిల్లీలో మంతనాలు జరిగాక మే 20వ తేదీన కర్ణాటకలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్లు ప్రమాణం తీసుకోగా.. వారితోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వీరు దేవుడు, అల్లా, బుద్ధ, బసవన్న, అంబేద్కర్ల పేర్లు ఉటంకిస్తూ ప్రమాణం చేయడం గమనార్హం.
సిద్దరామయ్య దేవుడు అంటూ ప్రమాణం తీసుకున్నారు. డీకే శివకుమార్ తన ఆధ్యాత్మిక గురువు గంగాధర్ అజ్జాను పేర్కొంటూ ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రుల్లో సతీశ్ జర్కిహోళి బుద్ధ, బవసన్న, అంబేద్కర్ పేర్లను పేర్కొంటూ ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. జీ పరమేశ్వర, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, ప్రియాంక్ ఖర్గే, కేహెచ్ మునియప్పలు దేవుడని తమ ప్రమాణంలో పేర్కొన్నారు. రామలింగా రెడ్డి వీటినేవీ పలుకలేదు.
Also Read: కేజ్రీవాల్తో బీహార్ సీఎం నితీష్ కుమార్ భేటీ: విపక్షాల ఐక్యతపై చర్చ
జమీర్ అహ్మద్ ఖాన్ అల్లాను, తన తల్లిని పేర్కొంటూ ప్రమాణం తీసుకున్నారు. అదీ ఆంగ్లభాషలో ప్రమాణ స్వీకారం చేశారు. చామరాజ్ పేట్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ 2018లోనూ నూతన మంత్రిగా ఇంగ్లీష్లోనే ప్రమాణం తీసుకున్నారు. ఆ తర్వాత తనకు కన్నడ భాష సరళంగా రాదని, కాబట్టి ప్రమాణ స్వీకారంలో పొరపాటు జరిగే ముప్పు ఉంటుందని ఆంగ్ల భాషను ఎంచుకున్నట్టు చెప్పి క్షమాపణ చెప్పారు.