
కర్ణాటకలో కాంగ్రెస్ అనుసరించిన గ్యారెంటీ కార్డ్ పథకాలు దేశం మొత్తానికి నమూనాగా మారుతాయన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తూ బడా వ్యాపారులకు ప్రభుత్వాలు సాయపడతాయన్నారు. సామాన్యులను ఎలా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తాము నిర్ణయం తీసుకున్నామని శివకుమార్ పేర్కొన్నారు. ఆర్ధిక సమస్యలు, నిరుద్యోగం, పేదరికం ప్రధాన అంశాలని.. అవి సైద్ధాంతిక అంశాలు కావని ఆయన తెలిపారు.
మరోవైపు.. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ చేతులు కలుపుతున్నాయని శివకుమార్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన పనితీరు కనబరిచడంతో కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందని పీసీసీ చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాషాయ పార్టీకి దక్షిణాదిలో స్థానం లేకుండా చేస్తామన్నారు. ఎన్నికల హామీలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ యూనిట్లు పిలుపునివ్వాల్సి వుంటుందని డీకే శివకుమార్ సూచించారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఎన్నికల హామీలు మూసలా మారుతాయా అనే ప్రశ్నకు .. డీకే స్పందిస్తూ కర్ణాటకలో పార్టీ ఘన విజయం సాధించేందుకు హామీలు కీలకంగా మారాయని శివకుమార్ స్పష్టం చేశారు. హామీలనేవి ఆయా రాష్ట్రాల ఆర్ధిక శక్తిపై ఆధారపడి వుంటాయని.. కర్ణాటకకు ఆర్ధిక బలం వుందని ఆయన పేర్కొన్నారు. ధరల పెరుగుదల కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా ప్రజలకు అండగా వుండాలనే ఉద్దేశంతోనే ఈ గ్యారెంటీ హామీలు ఇచ్చామని డీకే చెప్పారు. కులం, మతం ఆధారంగా ఎలాంటి వివక్ష లేకుండా ఐదు హామీలు అమలు చేయాలని జూన్ 2న కర్ణాటక కేబినెట్ నిర్ణయించిందన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పథకాలను అమలు చేయడానికి టైమ్లైన్ను సైతం నిర్ణయించింది.
కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు ఇవే :
ఇకపోతే.. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు వున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్ధి ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటును గెలుచుకున్నాయి. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకోనుందని ఓ వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కుమారస్వామి పలువురు బీజేపీ పెద్దలను కలిశారని ప్రచారం జరుగుతోంది. అయిేత ఈ వార్తలను జేడీఎస్ ఖండించింది.