జైలు నుంచి కేంద్రమంత్రికి బెదిరింపు కాల్స్.. ‘మర్డర్ కేసు నిందితుడు 3 సార్లు కాల్ చేశాడు’

By Mahesh KFirst Published Jan 15, 2023, 4:56 PM IST
Highlights

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పీఆర్ ఆఫీసుకు శనివారం బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బెదిరింపు కాల్స్ కర్ణాటకలోని బెలగావి జైలులోని ఓ ఖైదీ చేశాడని తాజాగా తెలిసింది. గతంలోనూ ఆయన పలువురు ప్రముఖులకు ఇలాగే బెదిరింపు కాల్స్ చేశాడు.
 

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. డిమాండ్ చేసిన మొత్తాన్ని అందించాలని, లేదంటే ఆఫీసునే పేల్చేస్తామని ఆ కాలర్ వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా, ఆ కాలర్ ఓ ఖైదీ అని, కేంద్ర మంత్రికి ఆ బెదిరింపు కాల్స్ ఓ జైలు నుంచి చేశాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నిందితుడు తనని తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకున్నాడు. 

మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆ నిందితుడు శనివారం మధ్యాహ్నం మూడు సార్లు మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసుకు బెదిరింపు కాల్స్ చేశాడు.దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌ సభ్యుడినని చెప్పుకున్న ఓ ఖైదీ జైలు నుంచే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుకు బెదిరింపు కాల్స్ చేశాడు. రూ. 100 కోట్లు అరేంజ్ చేయాలని, లేదంటే ఆఫీసు పేల్చేస్తానని హిందీలో మాట్లాడుతూ కర్ణాటకలోని బెలగావి జైలులోని ఆ నిందితుడు మూడు సార్లు కాల్ చేశాడని నాగ్‌పూర్ సీపీ అమితేష్ కుమార్ తెలిపారు. ఆ ఫోన్‌ను పీఆర్ ఆఫీసర్ లిఫ్ట్ చేశారు.

Also Read: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామని బెదిరింపు కాల్స్.. భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు..

ఆ కాల్ చేసిన ఖైదీని జయేశ్ పుజారీగా గుర్తించారు. బెలగావి జైల్ బ్యారక్ నుంచి ఈ కాల్ చేసినట్టు పోలీసులు వివరించారు. 2016లో జైలు బ్రేక్ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. అతను గతంలో పలువురు ప్రముఖులు ఫోన్ చేసి బెదిరింపులు జరిపిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనను జైలులోనే విచారిస్తున్నామని, ఈ బెదిరింపు కాల్స్ చేయడం వెనుక కారణం ఏముందనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నదని వివరించారు.

శనివారం ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, మధ్యాహ్నం 12.32 గంటలకు పుజారీ గడ్కరీ పీఆర్‌ ఆఫీసు ల్యాండ్ లైన్‌కు కాల్ చేశాడు. చివరి సారి ఫోన్ చేసినప్పుడు పుజారీ తన మొబైల్ నెంబర్ కూడా షేర్ చేశాడు.

click me!