మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే

Published : Dec 09, 2025, 12:54 PM IST
Menstrual

సారాంశం

మహిళా ఉద్యోగుల నెలసరి ఇబ్బందులకు గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఈ సమయంలో వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని భావించింది. కానీ ఈ నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు అడ్డుకుంది… నవంబర్ 20న జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.  

Bengaluru : ఉద్యోగాలు చేసే మహిళల కోసం కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఆరాష్ట్ర హైకోర్టు అడ్డుకుంది.  రుతుస్రావం (నెలసరి) సమయంలో ఒకరోజు జీతంతో కూడిన సెలవు ఇచ్చేందుకు ఇటీవలే సిద్దరామయ్య సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది… తాజాగా కర్ణాటక హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ బెంగళూరు హోటళ్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జ్యోతి మూలిమని ధర్మాసనం ప్రభుత్వ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చి తదుపరి విచారణను వాయిదా వేసింది.

రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ 2025 నవంబర్ 20న మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుపై నోటిఫికేషన్ జారీ చేసింది. నెలసరి సెలవును అమలు చేయడానికి సిద్ధమైన ప్రభుత్వంపై బెంగళూరు హోటల్ యజమానులు న్యాయపోరాటానికి దిగారు. ప్రభుత్వ చర్యలతో హోటల్ పరిశ్రమకు తీవ్ర సమస్యలు వస్తాయని బెంగళూరు హోటళ్ల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.

ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఎందుకు?

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. 'ఏ చట్టంలోనూ లేని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏకపక్ష ఉత్తర్వు వల్ల హోటల్ పరిశ్రమకు తీవ్ర సమస్యలు వస్తాయి. ఉత్తర్వులు జారీ చేసే ముందు ప్రభుత్వం ఏ సంఘం అభిప్రాయం తీసుకోలేదు' అని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ వాదన విన్న న్యాయస్థానం 'ప్రభుత్వ ఉత్తర్వులకు ముందు సంబంధిత సంఘాల అభిప్రాయం తీసుకున్నారా?' అని నేరుగా ప్రశ్నించింది. దీనికి హోటల్ అసోసియేషన్ తరఫు న్యాయవాది 'లేదు' అని సమాధానం ఇచ్చారు. దీంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను ప్రశ్నిస్తూ, తదుపరి విచారణ వరకు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.

ప్రభుత్వానికి నోటీసులు; మార్పులకు అవకాశం

ఈ పిటిషన్‌పై అభ్యంతరాలు చెప్పాలని కోర్టు ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. అయితే స్టే ఉత్తర్వులను మార్చాలని కోరుతూ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రగతిశీల ఉత్తర్వు సాంకేతిక, చట్టపరమైన అడ్డంకుల వల్ల తాత్కాలికంగా అమలుకు నోచుకోలేదు. చివరికి ప్రభుత్వ చర్య చట్టబద్ధమా కాదా అనేది కోర్టు తదుపరి విచారణలో తేలుస్తుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu
LPG Crisis : హమ్మయ్యా.. హర్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకలు