
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హంగ్కు ఏమాత్రం అవకాశం లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా హస్తం నిలిచింది. బీజేపీ కనీస పోటీ ఇవ్వకపోగా.. జేడీఎస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే బీజేపీకి సాంప్రదాయ ఓటుగా వున్న కొన్ని వర్గాలు ఆ పార్టీకి ఈసారి దూరమైనట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారిలో ‘‘లింగాయత్’’లు ఒకరు. ఈ ఎన్నికల్లో వారు బీజేపీకి షాకిచ్చినట్లుగా ఫలితాలను బట్టి చెప్పవచ్చు. నార్త్, సెంట్రల్ కర్ణాటకల్లో లింగాయత్ సామాజిక వర్గం అత్యంత బలమైనదన్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి 27న శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020లో శివమొగ్గ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అప్పటి కర్ణాటక సీఎం యడియూరప్ప శంకుస్థాపన చేశారని.. ఈ ఎయిర్పోర్ట్ ఆయనకు పుట్టినరోజు కానుకని ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ అన్నారు. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత.. రాజకీయాల నుంచి రిటైర్ అయిన లింగాయత్ నేత యడియూరప్పతో ప్రధాని మోడీ చేయి చేయి కలిపి నడిచారు.
ఈ దృశ్యం యడియూరప్ప పట్ల ప్రధాని మోడీకి వున్న ప్రేమ, గౌరవంతో పాటు కర్ణాటక రాజకీయాల్లో యడ్డీ ప్రాముఖ్యతను కూడా చూపింది. కర్ణాటకలో 17 నుంచి 20 శాతం ఓట్ల వాటాను కలిగి వున్న లింగాయత్లలో ప్రముఖ నేతగా యడియూరప్ప ఎదిగారు. రాష్ట్రంలోని లింగాయత్లు సాంప్రదాయకంగా బీజేపీకి ఓట్లు వేస్తూ వచ్చారు. వీరి మద్ధతు కారణంగానే కర్ణాటకలో బీజేపీ పలు మార్లు అధికారాన్ని అందుకోగలిగింది. 2008లో యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
లింగాయత్ల ఓట్లను కాపాడుకోవడం కోసం యడియూరప్పను అంటిపెట్టుకోవడం మినహా బీజేపీకి మరో మార్గం లేదన్న వాస్తవాన్ని మోడీ.. ఆయన చేయిని పట్టుకుని నడవటం నొక్కి చెప్పింది. రెండేళ్ల క్రితం యడియూరప్పను వయసు కారణం చూపి సీఎం పదవి నుంచి తొలగించడంపై లింగాయత్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన బసవరాజ్ బొమ్మై కూడా లింగాయత్ వర్గమే అయినప్పటికీ.. ఆ కమ్యూనిటీలో యడియూరప్పకు వున్న ఇమేజ్ బొమ్మైకి లేదు.
దాదాపు 17 నుంచి 20 శాతం జనాభాతో పాటు రాష్ట్రంలోని మొత్తం 224 నియోజకవర్గాలకు గాను 100 చోట్ల ఆధిపత్యం చెలాయిస్తుందంటేనే లింగాయత్ల ప్రాముఖ్యతను అంచనా వేయవచ్చు. కర్ణాటకకు ముఖ్యమంత్రులుగా చేసిన 23 మందిలో 9 మంది లింగాయత్ వర్గానికి చెందినవారే. అయితే ప్రస్తుతం కర్ణాటకలో పోకడలను గమనిస్తే.. అవినీతి ఆరోపణల నేపథ్యంలో యడియూరప్పను పదవి నుంచి తొలగించడాన్ని లింగాయత్లు అవమానంగా భావించారు. ఈ క్రమంలోనే బీజేపీని పక్కనబెట్టి వారు కాంగ్రెస్ను ఆదరించారని ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చెప్పవచ్చు.
కారణం ఏదైనా కావచ్చు.. యడియూరప్ప కార్డు బీజేపీని ఈసారి గెలిపించలేకపోయిందని స్పష్టంగా చెప్పవచ్చు. లింగాయత్ల ప్రాబల్యం వున్న 69 స్థానాల్లో కాంగ్రెస్ 43 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఇది 2018 ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ. బీదర్, రాయచూర్, గుల్బర్గా, ధార్వాడ్, గదగ్, బెళగావితో పాటు ఉత్తర కర్ణాటకలో లింగాయత్ల ప్రాబల్యం ఎక్కువ. తాజా పోకడలను పరిశీలిస్తే.. లింగాయత్లు తమ విధేయతను మార్చుకున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పై జిల్లాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది.