
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ.. కింగ్ మేకర్ అవుదామనుకున్న జేడీఎస్కు షాకిస్తూ హస్తం పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా.. బీజేపీ 65 స్థానాల్లో, జేడీఎస్ 20, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో వున్నారు.
అంతాబాగానే వుంది కానీ.. ఇప్పుడు సీఎం ఎవరు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి కానున్నారు. ఆ ఒక్కరు ఎవరన్నది తేలాల్సింది వుంది. పార్టీలో గొడవలు వున్నప్పటికీ.. వీరిద్దరి కలిసి పనిచేశారు. అందుకే కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించగలిగింది.
Also Read: కర్ణాటకలో కాంగ్రెస్ దే ఆధిక్యం.. ముఖ్యమంత్రి ఎవరనేదానిపైనే ఫోకస్ అంతా.. ఎవరి బలాలేంటంటే ?
అలాంటిది సీఎంగా ఒకరిని ఎంపిక చేస్తే.. రెండవ వారు తీవ్ర అసంతృప్తికి గురవుతారన్నది అందరికీ తెలిసిందే. దీనిని అదునుగా చేసుకుని బీజేపీ అధికారాన్ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే. సీఎం ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. సీఎం ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.
మరోవైపు ఈ రోజు సాయంత్రం కానీ , రేపు మధ్యాహ్నం కానీ బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త సీఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. సీఎల్పీ సమావేశం తర్వాత గవర్నర్ను కలిసే అవకాశం వుంది. ఈ క్రమంలోనే గెలిచిన ఎమ్మెల్యేలంతా బెంగళూరుకు రావాలని కాంగ్రెస్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రారంభించనుంది.