
తాను ఇంకా ఎన్ని రోజులు సీఎం కుర్చీలో ఉంటానో తెలియదు అని అంటున్నారు.. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఈ ఏడాది కర్ణాటక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఎన్నికల్లో హంగ్ ఏర్పడగా.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కుమారస్వామి సీఎం అయ్యారు.
సీఎం పదవి చేపట్టిన నాటినుంచి ఈ పదవి శాశ్వతం కాదని, అదో ముళ్ల సింహాసనం అని పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా శృంగేరీ శారదా మఠంలో శత్రునాశనం, ఆరోగ్యాభివృద్ధి కోసం ‘ప్రత్యంగిరా’ హోమాన్ని జరిపించిన సీఎం కుమారస్వామి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.
తాను ఇంకెన్ని రోజులు సీఎం పదవిలో ఉంటాననేది అంతా దేవుడి మీదే ఆధారపడి ఉందన్నారు. తరచూ సీఎం తన పదవిపైన, ఆరోగ్యం విషయంలో నిరుత్సాహంగా మాట్లాడడం సొంత పార్టీ జేడీఎస్తోపాటు సంకీర్ణ కూటమి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలలోనూ అసంతృప్తికి కారణమవుతోంది.