కాన్పూర్ ఎన్ కౌంటర్: వికాస్ దూబేను ఎలా పట్టుకున్నారంటే...

By telugu teamFirst Published Jul 9, 2020, 10:25 AM IST
Highlights

ఎనిమిది పోలీసులను పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వారం రోజుల తర్వాత పోలీసుల చేతికి చిక్కారు. అనూహ్యమైన రీతిలో వికాస్ దూబే ఉజ్జయిన ఆలయం వద్ద పోలీసులకు చిక్కాడు.

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ లోని తన నివాసం వద్ద ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే వారం రోజుల తర్వాత పోలీసుల చేతికి చిక్కాడు. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అతను పోలీసులకు చిక్కాడు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వికాస్ దూబే పూజలు చేయడానికి వచ్చాడు. మహంకాళి ఆలయం వద్ద సెక్యూరిటీ గార్డు వికాస్ దూబేను పట్టుకున్నాడు. ఆ విషయాన్ని సెక్యూరిటీ గార్డు ఉజ్జయిని ఎస్పీ మనోజ్ సింగ్ కు చెప్పాడు. దాంతో ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను తమ కస్టడీలోకి తీసుకున్నారు. 

వికాస్ దూబేను అదుపులోకి తీసుకున్న విషయాన్ని మధ్యప్రదేశ్ డీజీపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు చెప్పారు. శివరాజ్ సింగ్ చౌహన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. 

వికాస్ దూబేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచరులు ముగ్గురు హతమయ్యారు. గురువారం ఉదయం ఇద్దరు హతం కాగా, అంతకు ముందు ఒకతను మరణించారు.

ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగస్టర్ వికాస్ దూబే కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచరులు ఇద్దరు ఉత్తరప్రదేశ్ పోలీసుల చేతుల్లో హతమయ్యారు. 

వికాస్ దూబే ముఖ్య అనుచరుడైన ప్రవీణ్ అలియా బౌవా దూబే గురువారం ఉదయం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. అతనిపై 50 వేల రూపాయల రివార్డు ఉంది. జూలై 3వ తేదీన జరిగిన ఎదురకాల్పుల్లో 8 మందిని చంపిన కేసులో అతను నిందితుడు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ప్రత్యేక టాస్క్ పోలీసులు సంయుక్తంగా ఇటావా సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బౌవాను కాల్చి చంపారు. 

స్కార్పియోలో వచ్చిన నలుగురు సాయుధ దుండగులు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో బకేవార్ పీఎస్ పరిధిలోని మహేవా వద్ద జాతీయ రహదారిపై స్విఫ్ట్ డిజైర్ కారును దోపిడీ చేసారని, ఆ కారును సివిల్ లైన్స్ పీఎస్ పరిధిలోని కచౌరా రోడ్డుపై పోలీసులు చేజ్ చేశారని, దాంతో స్విఫ్ట్ డిజైర్ ఓ చెట్టును ఢీకొట్టిందని, వెంటనే దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారని ఇట్టావా ఎస్ఎస్పీ ఆకాశ్ తోమర్ చెప్పారు. 

ఓ గుర్తు తెలియని వ్యక్తికి ఎదురుకాల్పుల్లో తీవ్రమైన గాయాలు అయ్యాయని, ఆస్పత్రికి చేర్చేలోగానే అతను మరణించాడని, సంఘటన స్థలం నుంచి ఓ పిస్టల్ ను, ఓ డబుల్ బ్యారెల్ గన్ ను, పలు కాట్రిడ్జెస్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

ఇదిలావుంటే, కాన్పూర్ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచురుడు ప్రభాత్ మిశ్రా హతమయ్యాడు. బుధవారంనాడు ప్రభాత్ మిశ్రాను హర్యానా పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ట్రాన్సిట్ రిమాండ్ పై అతన్ని ఉత్తరప్రదేశ్ కు తీసుకుని వచ్చారు. విచారణ జరుపుతున్న సమయంలో అతను పారిపోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ప్రభాత్ మిశ్రా మరణించాడని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు ప్రభాత్ మిశ్రాను తీసుకుని వస్తుండగా పంకీ సమీపంలో వాహనం టైర్ పంక్చర్ అయిందని, ప్రభాత్ మిశ్రా ఓ పోలీసు నుంచి పిస్టల్ ను లాక్కుని కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని, ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ పోలీసులు గాయపడ్డారని అంటున్నారు. 

click me!