కాన్పూర్ ఎన్ కౌంటర్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అరెస్టు

By telugu teamFirst Published Jul 9, 2020, 9:56 AM IST
Highlights

మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. వికాస్ దూబేను పోలీసులు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో అరెస్టు చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

లక్నో: ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే పోలీసుల చేతికి చిక్కాడు. అతన్ని పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అరెస్టు చేశారు. ఎనిమిది మంది పోలీసులను చంపిన తర్వాత అతను పారిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారం రోజులుగా అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. హర్యానాలోని ఓ హోటల్ నుంచి అతను తృటిలో తప్పించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. 

ఇదిలావుంటే, ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగస్టర్ వికాస్ దూబే కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచరులు ఇద్దరు ఉత్తరప్రదేశ్ పోలీసుల చేతుల్లో హతమయ్యారు. 

వికాస్ దూబే ముఖ్య అనుచరుడైన ప్రవీణ్ అలియా బౌవా దూబే గురువారం ఉదయం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. అతనిపై 50 వేల రూపాయల రివార్డు ఉంది. జూలై 3వ తేదీన జరిగిన ఎదురకాల్పుల్లో 8 మందిని చంపిన కేసులో అతను నిందితుడు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ప్రత్యేక టాస్క్ పోలీసులు సంయుక్తంగా ఇటావా సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బౌవాను కాల్చి చంపారు. 

స్కార్పియోలో వచ్చిన నలుగురు సాయుధ దుండగులు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో బకేవార్ పీఎస్ పరిధిలోని మహేవా వద్ద జాతీయ రహదారిపై స్విఫ్ట్ డిజైర్ కారును దోపిడీ చేసారని, ఆ కారును సివిల్ లైన్స్ పీఎస్ పరిధిలోని కచౌరా రోడ్డుపై పోలీసులు చేజ్ చేశారని, దాంతో స్విఫ్ట్ డిజైర్ ఓ చెట్టును ఢీకొట్టిందని, వెంటనే దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారని ఇట్టావా ఎస్ఎస్పీ ఆకాశ్ తోమర్ చెప్పారు. 

ఓ గుర్తు తెలియని వ్యక్తికి ఎదురుకాల్పుల్లో తీవ్రమైన గాయాలు అయ్యాయని, ఆస్పత్రికి చేర్చేలోగానే అతను మరణించాడని, సంఘటన స్థలం నుంచి ఓ పిస్టల్ ను, ఓ డబుల్ బ్యారెల్ గన్ ను, పలు కాట్రిడ్జెస్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

 

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అరెస్ట్ pic.twitter.com/hX7FwE8MSA

— Asianet News Telugu (@asianet_telugu)

ఇదిలావుంటే, కాన్పూర్ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచురుడు ప్రభాత్ మిశ్రా హతమయ్యాడు. బుధవారంనాడు ప్రభాత్ మిశ్రాను హర్యానా పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ట్రాన్సిట్ రిమాండ్ పై అతన్ని ఉత్తరప్రదేశ్ కు తీసుకుని వచ్చారు. విచారణ జరుపుతున్న సమయంలో అతను పారిపోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ప్రభాత్ మిశ్రా మరణించాడని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు ప్రభాత్ మిశ్రాను తీసుకుని వస్తుండగా పంకీ సమీపంలో వాహనం టైర్ పంక్చర్ అయిందని, ప్రభాత్ మిశ్రా ఓ పోలీసు నుంచి పిస్టల్ ను లాక్కుని కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని, ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ పోలీసులు గాయపడ్డారని అంటున్నారు. 

click me!