ఎంఎన్ఎం చరిత్ర సృష్టించేది.. కానీ, అంతా ఆయన వల్లే: కమల్ పార్టీకి మరో నేత గుడ్‌బై

By Siva KodatiFirst Published May 20, 2021, 3:10 PM IST
Highlights

కమల్ హాసన్ ఏకపక్ష ధోరణి, నియంతృత్వ ప్రవర్తన కారణంగానే ఎంఎన్‌ఎం పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీకి దూరమైన నేతలు విమర్శలు చేస్తున్నారు.

రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు వచ్చానని చెప్పుకుంటున్న విలక్షణ నటుడు కమల్ హాసన్‌పై సొంత పార్టీ నేతలే విరుచుకుపడుతున్నారు. గత నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ దారుణంగా ఓటమిపాలైవ్వడం రాజకీయ, సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది.

అప్పటి నుంచి కమల్ హాసన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కమల్ హాసన్‌పై ఓ నేత తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీని వీడారు. తమిళనాడు ఎన్నికల్లో మక్కల్ నీది మైయమ్ పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలోని కీలక నేతల్లో ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్, ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు, ఇతర నేతలు పద్మప్రియ, ఏజీ మౌర్య, తంగవేల్, ఉమాదేవి, శేఖర్, సూర్య అయ్యర్ కమల్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

కమల్ హాసన్ ఏకపక్ష ధోరణి, నియంతృత్వ ప్రవర్తన కారణంగానే ఎంఎన్‌ఎం పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీకి దూరమైన నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలను, కార్యకర్తలను విజయ్ టీవీ మాజీ ప్రొడ్యూసర్ తప్పుదోవ పట్టించారని.. ఓటమికి అసలు కారణం ఆయనే అంటూ ఆరోపణలు చేస్తున్నారు.

Also Read:రాజీనామాలతో కుదేలు: ద్రోహి.. నెంబర్ టూపై కమల్ హాసన్ సీరియస్..!

ఇలాంటి ఆరోపణల మధ్య ఎంఎన్ఎం పార్టీ నుంచి మరో కీలక నేత సీకే కుమరవేల్ తప్పుకొన్నారు. పార్టీ నుంచి వెళుతూ కమల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. పార్టీని అభివృద్ధి చేయకపోగా వన్ మ్యాన్ పార్టీగా మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని కుమారవేల్ ఆరోపించారు. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయకపోగా, తన సొంత గెలుపు కోసమే స్వార్ధంగా వ్యవహరించారని కమల్‌పై మండిపడ్డారు. కేవలం దక్షిణ కోయంబత్తూరు సీటుపైనే దృష్టి పెట్టడంతో... తమిళనాడులో చరిత్ర సృష్టించాల్సిన పార్టీ గురించి కాకుండా.. పరాజయం పాలైన కమల్ చరిత్ర గురించి చదువుకోవాల్సి వచ్చింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

click me!