పుల్వామా కుట్ర పాక్‌లోనే.. ఆర్మీ ఆసుపత్రి నుంచే మసూద్ ఆదేశాలు

By Siva KodatiFirst Published Feb 17, 2019, 1:18 PM IST
Highlights

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పుల్వామా వద్ద సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్తాన్‌ వేదికగానే జరిగినట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పుల్వామా వద్ద సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్తాన్‌ వేదికగానే జరిగినట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడాలని జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సూచనలు ఇచ్చినట్లు గుర్తించాడు. అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలుగా రావాల్సిండిలోని ఆర్మీ బేస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన అక్కడే దాడికి వ్యూహరచన చేశాడు. పుల్వామా దాడికి ఆదేశాలిచ్చి భారీ విధ్వాంసానికి కుట్ర పన్నాడు.

కేవలం 8 రోజుల ముందే ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులను సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. గతేడాది భద్రతా దళాల చేతిలో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైనది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా కశ్మీర్ యువతను రెచ్చగొట్టినట్లు బయటకు వచ్చింది.

ఉగ్రవాదుల వల్ల శాంతికి భంగం కలుగుతుందని కొందరు మాట్లాడుతున్నారు.. కానీ మీరు కశ్మీర్ సరిహద్దుల వెంబడి పోరాటం ఆపకండి అంటూ ఆడియో టేపుల్లో మసూద్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. మరోవైపు మసూద్ రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో లేడని పాక్ నుంచి బుకాయింపులు వచ్చినా ధీటుగా బదులిచ్చిందుకు భారత్ ఆధారాల్ని సంపాదిస్తోంది.

యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ (యూజీసీ) నిర్వహించిన గత ఆరు కీలక సమావేశాలకు మసూద్ అజహర్ హాజరుకాకపోవడం.. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ధ్రువపరుస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా దాడులు నిర్వహించే జిహాదీ గ్రూపులను యూజేసీగా వ్యవహరిస్తారు.

అయితే పుల్వామా దాడికి సంబంధించిన ప్రణాళికలను మసూద్ యూజేసీలోని ఇతర జిహాదీ గ్రూపులతో పంచుకోలేదని సమాచారం. ఆడియో టేపుల ద్వారా కశ్మీర్ లోయలో ఆత్మాహుతి దాడులు చేసే విధంగా అక్కడి యువతను రెచ్చగొట్టాలని తన మరో మేనల్లుడు మహమ్మద్ ఉమేర్, జైషే మాజీ కమాండర్ అబ్ధుల్ ఘాజీలకు మసూద్ రహస్య సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ని కారుతో ఢీకొట్టిన అబుల్ అహ్మద్ దార్‌కు ఘాజీనే శిక్షణ ఇచ్చినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. 
 

click me!