
డబ్బులు ఎవరికీ చేదు కాదు. ప్రతి ఒక్కరూ తాము జీవించడం కోసం డబ్బు సంపాదించాలనే అనుకుంటూ ఉంటారు. దాని కోసం పగలు, రాత్రి కష్టపడేవారు కూడా ఉన్నారు. అలాంటి డబ్బును ఓ వ్యక్తి ఎవరికి కావాల్సినంత వారు ఏరుకోండి అంటూ, గాలిలో వెద జల్లాడు. ఈ సంఘటన జైపూర్ లో చోటుచేసుకుంది. గతంలో ఇలా డబ్బులు విసిరిన సందర్భాలు చాలానే చూశాం. అయితే, ఈ వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకొని వచ్చి మరీ ఈ డబ్బులు చల్లాడు. అది కూడా మనీ హీస్ట్ మాస్క్ కావడం విశేషం.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని మాల్వియా నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మనీహీస్ట్ అనే వెబ్ సిరీస్ లో చూపించినట్లుగా, ముఖానికి మాస్క్, అలాంటి డ్రెస్ వేసుకోసుకొని వచ్చాడు. స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద మాల్స్, కాంప్లెక్స్ల వద్దకు చేరుకున్నాడు. జన సందోహం మధ్యలోనే కారు ఆపి, కాసేపటికి ఏకంగా కారు పైకి ఎక్కేశాడు. అంతే, కారు పైకి ఎక్కిన తర్వాత తన దగ్గర ఉన్న బ్యాగ్ లో నుంచి డబ్బులు తీసి విసరడం మొదలుపెట్టాడు.
మొదట అతను చేసిన పనికి అందరూ షాకయ్యారు. తర్వాత తేరుకొని ఆ డబ్బులను ఏరుకోవడం మొదలుపెట్టారు. కొందరు మాత్రం అతను చేస్తున్న పనిని కెమేరాల్లో బంధించడం మొదలుపెట్టారు. సుమారు 15 నుంచి 20 నిముషాల పాటు లక్షల రూపాయల మేర రూ.20, రూ.50 నోట్లను వెదజళ్లాడు. ఈ ఘటనను చాలా మంది తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డబ్బులు ఎక్కువయ్యి ఇలా చేస్తున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.