
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఇస్రో(ISRO) ప్రయోగాలూ కొంత వెనుకబాటు పట్టాయి. వాటికి తోడు గతేడాది వైఫల్యాలు ఇస్రో వేగాన్ని కొంత తగ్గించాయి. గతేడాది ఇస్రో కేవలం ఒకే ఒక్క ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. గత రెండేళ్లల్లో కేవలం మూడే ప్రయోగాలను సక్సెస్ఫుల్గా నిర్వహించింది. కాగా, ప్రధాన ప్రాజెక్టులను ఇస్రో మరికొన్ని నెలలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మాత్రం ఇస్రో చాలా బిజీ ఇయర్గా మారనున్నట్టు తెలుస్తున్నది. చంద్రయాన్-3, మానవ రహిత గగన్యాన్ మిషన్(Gaganyaan mission) వంటి ప్రధాన ప్రాజెక్టులనూ ఈ ఏడాదిలో విజయవంతం చేసుకునే పనిలో ఉండనుంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది తొలి శాటిలైట్ ప్రయోగాన్ని ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే అంటే 13వ తేదీ ఉదయమే కౌంట్డౌన్ ప్రారంభం అయింది.
శ్రీహరికోట(Sriharikota)లోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఫిబ్రవరి 14 ఉదయం 5.59 గంటలకు ఇస్రో పీఎస్ఎల్వీ-సీ52 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్-04/EOS-04)ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగాన్ని ఇస్రో అధికారిక యూట్యూబ్ చానెల్లో లైవ్లో ప్రసారం చేయనున్నారు. 1710 కిలోల భారం ఉన్న ఈవోఎస్-04 ఉపగ్రహం సూర్యుడితో సింక్లో ఉండి 529 కిలోమీటర్ల పోలార్ ఆర్బిట్లో తిరుగుతుంది.
ఈవోఎస్-04 శాటిలైట్ ఒక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ వ్యవసాయం, అటవీ, సాయిల్ మాయిశ్చర్, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్ వంటి వాటికి సంబంధించిన హైక్వాలిటీ ఇమేజ్లను అందిస్తుందని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మిషన్లో ఈవోఎస్-04తోపాటు రెండు చిన్న ఉపగ్రహాలూ అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కొలరాడో యూనివర్సిటీకి చెందిన లాబరేటరీ ఆఫ్ అట్మాస్ఫెరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్తో సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్టూడెంట్ శాటిలైట్్ (ఇన్స్పైర్ శాట్-1), టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ శాటిలైట్ ఐఎన్ఎస్-2టీడీలను ప్రయోగించనుంది.
ప్రస్తుతం ఖగోళంలో భారత్కు చెందిన 53 శాటిలైట్లు సేవలు అందిస్తున్నాయి. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందులో 21 శాటిలైట్లు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు. మిగిలిన 21 శాటిలైట్ల కమ్యూనికేషన్కు సంబంధించిన ఉపగ్రహాలు. కాగా, ఎనిమిది ఉపగ్రహాలు నేవిగేషన్ శాటిలైట్లు. కాగా, మిగిలిన మూడు శాటిలైట్లు సైన్స్ శాటిలైట్లు.
రేపు రోదసిలోకి పంపే పీఎస్ఎల్వీ రాకెట్తో భారత్ 54వ ఉపగ్రహాన్ని కలిగి ఉండనుంది.
ఇదిలా ఉండగా, చంద్రయాన్-3 (Chandrayaan-3) అంతరిక్ష మిషన్ ఏడాది ఆగస్టు లో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి (సైన్స్ అండ్ టెక్నాలజీ) డాక్టర్ జితేందర్ సింగ్ (Dr Jitendra Singh) వెల్లడించారు. పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సంబంధిత వివరాలు తెలియజేశారు.