మరో ప్రయోగానికి సిద్దమైన ఇస్రో.. ఎల్లుండి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ- సీ54

By Sumanth KanukulaFirst Published Nov 24, 2022, 5:08 PM IST
Highlights

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ మొదటి ప్రయోగ వేదికపై నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే రాకెట్‌ అనుసంధాన ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఈ రాకెట్‌ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 960కిలోల ఈవోఎస్‌-06 (భూమి పరిశీలన ఉపగ్రహం - 06)తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు.

నానో ఉపగ్రహాల జాబితాలో భారత్‌, భూటాన్‌ సంయుక్తంగా రూపొందించిన భూటాన్‌ శాట్‌, పిక్సెల్‌ సంస్థ తయారు చేసిన ఆనంద్‌ శాట్‌, ధ్రువ స్పేస్‌ సంస్థ రూపొందించిన రెండు థైబోల్ట్ శాట్‌లు, అలాగే అమెరికాకు చెందిన స్పేస్‌ ఫ్లైట్‌ సంస్థకు చెందిన నాలుగు అస్ట్రోకాస్ట్‌ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-06 (ఈవోఎస్‌-06) అనేది ఓషన్‌శాట్ సిరీస్‌లోని మూడవ తరం ఉపగ్రహం. ఇది ఓషన్‌శాట్-2 స్పేస్‌క్రాఫ్ట్ కొనసాగింపు సేవలను మెరుగైన పేలోడ్ స్పెసిఫికేషన్‌లతో పాటు అప్లికేషన్ ఏరియాలతో అందించడానికి రూపొందించబడింది.

ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ రేపు ఉదయం 10.26 గంటలకు ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలిస్తే ఎల్లుండి ఉదయం 11.56గంటలకు పీఎస్‌ఎల్‌వీ -సీ54 రాకెట్‌ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
 

click me!