
Indian Veterinary Research Institute Cow Urine Report: భారత్ లో చాలా సంవత్సరాల నుంచి గోవును పూజిస్తారు. గో మూత్రం అనేక అనారోగ్య సమస్యలను దగ్గరకు రాకుండా చేస్తుందని భావిస్తూ దానిని తీసుకుంటున్నారు. అయితే, గోమూత్రం మనుషులకు మంచిది కాదంటూ ఐవీఆర్ఐ ఒక షాకింగ్ రిపోర్టును విడుదల చేసింది. గోవు కంటే గేదె మూత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన పీహెచ్ డీ విద్యార్థులు తమ పరిశోధన నివేదికలో పేర్కొన్నారు. ఆవు మూత్రంలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. ఆవు మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందనీ, ఇది ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ) నివేదిక పేర్కొంది. ఎవరైనా సరే నేరుగా గోమూత్రం తాగడం మానుకోవాలనీ, అది వారిని అనారోగ్యానికి గురి చేస్తుందని తన పరిశోధన నివేదికలో పేర్కొంది. అదే పరిశోధన నివేదికలో ఆవు కంటే గేదె మూత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఐవీఆర్ఐలో పీహెచ్ డీ విద్యార్థులతో ఐవీఆర్ఐ ఇనిస్టిట్యూట్ కు చెందిన భోజ్ రాజ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో ఆవులు, ఎద్దుల మూత్రంలో ఎస్చెరిచియా కోలి సహా సుమారు 14 రకాల హానికరమైన బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. ఇవి కడుపులో అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని పేర్కొంటూ గో మూత్రాన్ని నేరుగా తీసుకోవడం నివారించాలని గుర్తించారు.
ఈ పరిశోధకుల నివేదికను ఆన్ లైన్ రీసెర్చ్ వెబ్ సైట్ రీసెర్చ్ గేట్ లో ప్రచురించారు. ఆవులు, గేదెలు, మానవుల నుంచి సేకరించిన 73 మూత్ర నమూనాలను విశ్లేషించగా గేదె మూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఆవుల కంటే మెరుగ్గా ఉందని ఎపిడెమియాలజీ విభాగం అధిపతి తేలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
ఆవు మూత్రం తీసుకోవడానికి సిఫారసు లేదు..
సాహివాల్, థార్పార్కర్, వింద్వానీ (క్రాస్ బ్రీడ్) అనే మూడు రకాల ఆవులతో పాటు గేదెలు, మనుషుల నుంచి నమూనాలు సేకరించాం. 2022 జూన్ మరియు నవంబర్ మధ్య నిర్వహించిన పరిశోధనలో వ్యాధికారక బ్యాక్టీరియాలో ఎక్కువ భాగం ఆరోగ్యకరమైన వ్యక్తుల మూత్రం నుండి తీసుకువెళతాయని తేల్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గోమూత్రాన్ని మానవులు నేరుగా తీసుకోవడానికి సిఫారసు చేయలేమని మా పరిశోధనలో తేలిందని పరిశోధకుల బృందం పేర్కొంది. గోమూత్రం యాంటీ బాక్టీరియల్ అని చెబుతున్నారని, అయితే ఇది నిజం కాదని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలు గోమూత్రం కోసం కాదని పరిశోధన బృందం సభ్యుడు, ఎపిడెమియాలజీ విభాగం అధిపతి పేర్కొనడం గమనార్హం.