ఇకపై ఇండియాలో ఆదివారాల్లో రైళ్లన్నీ లేటేనట..?
ఆదివారం వీకెండ్ కదా అని మీరు ఏదైనా పని మీద వేరే ఊరు వెళ్లడానికి రైలు టికెట్ బుక్ చేసుకున్నారా..? అయితే మీకు ఒక అలెర్ట్ మెసేజ్.. ఇకపై ఆ రోజు భారతదేశంలో రైళ్లన్ని లేట్ అవుతాయట.. ఈ విషయం ఏ వాట్సాప్లోనో.. సోషల్ మీడియాలోనో సరదాగా చక్కర్లు కొడుతున్న మేటర్ కాదు.. స్వయంగా ఇండియన్ రైల్వే చేసిన ప్రకటన. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా మరమ్మత్తులు, ఇతర నిర్వహణ కార్యక్రమాలు చేపట్టాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.
చిన్న చిన్న పనులు వారంలో అన్ని రోజులు నిర్వహిస్తామని.. ఆరేడు గంటలు పట్టే పనులు ఆ ఒక్క రోజు నిర్వహిస్తామని.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.. ఈ కారణంగా రైళ్లు ఆలస్యమవుతాయని.. నిర్ణీత సమయం కంటే బండి ఆలస్యమయ్యే పక్షంలో రిజర్వుడు టికెట్ ఉన్న ప్రయాణికులకు భోజనం, మంచినీటిని ఉచితంగా అందజేస్తామని పీయూష్ గోయల్ వెల్లడించారు.. రైలు లేటయ్యే సమాచారాన్ని ఎస్ఎంఎస్ చేస్తామని.. వార్తాపత్రికల్లో ప్రకటన ఇస్తామని చెప్పారు.. స్వాతంత్ర్య దినోత్సవం నాటికి కొత్త రైల్వే టైం టేబుల్ తయారవుతుందని.. ఆ తరువాత రైళ్ల ఆలస్యంపై కచ్చితమైన సమాచారం చెప్పగలమని మంత్రి స్పష్టం చేశారు..