
రాజస్తాన్ హనుమాన్ఘర్ జిల్లాలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 యుద్ద విమానం కూలిపోయింది. హనుమాన్గఢ్లోని డబ్లీ ప్రాంతంలో విమానం కూలింది. విమానం ఓ ఇంటికప్పుపై కూలడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ ప్రాణాలతో బయటపడినట్టుగా జిల్లా కలెక్టర్ రుక్మణి రియార్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ జస్సరామ్ బోస్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
హనుమాన్ఘర్ జిల్లాలోని బహ్లోల్నగర్లో ఇంటిపై విమానం కూలిపోవడంతో.. అక్కడున్న ఇద్దరు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి గాయపడ్డాడని చెప్పారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని వెల్లడించారు.
అయితే మిగ్-21 విమానం రాజస్థాన్లోని సూరత్గఢ్ ఎయిర్బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఐఏఎస్ ఒక ప్రకటనలో.. ‘‘ఈ రోజు ఉదయం సాధారణ శిక్షణలో భాగంగా సూరత్గఢ్ సమీపంలో ఐఏఎఫ్ మిగ్-21 విమానం కూలిపోయింది. పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించడం జరిగింది’’ అని పేర్కొంది.