
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. అందులో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలు, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎన్కౌంటర్లో హతమైన ఇద్దరు నక్సలైట్లపై మొత్తంగా రూ. 11 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 400 కిమీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్పురం గ్రామ సమీపంలోని అడవిలో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ఉన్నప్పుడు ఉదయం 5.30 గంటలకు కాల్పులు జరిగాయని సుక్మా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు.
గొలపల్లి లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్ఓఎస్) నక్సల్ కమాండర్ మడ్కం ఎర్రాతో పాటు 30-35 మంది టీమ్ సభ్యులు ఉన్నట్లు పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందడంతో డీఆర్జీ బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా చెప్పారు. డీఆర్జీ పెట్రోలింగ్ టీమ్లలో ఒకటి దంతేష్పురం అడవులను చుట్టుముట్టినప్పుడు.. మావోయిస్టులు కాల్పులు జరిపారని తెలిపారు. ఆ తర్వాత ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎన్కౌంటర్ ముగిసి తర్వాత ఘటన స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. వారిని ఎల్ఓఎస్ కమాండర్ ఎర్రా, అదే స్క్వాడ్ డిప్యూటీ కమాండర్ పొడియం భీమే అనే మహిళా మావోయిస్టుగా గుర్తించారు.
ఎర్రాపై రూ. 8 లక్షల రివార్డు ఉండగా.. భీమేపై రూ. 3 రివార్డు ఉందని తెలిపారు. ‘‘నక్సలైట్ల ఏరియా కమిటీ సభ్యుడు కూడా అయిన ఎర్రా.. నక్సల్స్ హింసాకాండలో రెండు డజన్లకు పైగా సంఘటనలలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి’’ సునీల్ శర్మ తెలిపారు. పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు.