భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 149 రోజుల్లో ఇదే అత్యధికం..

By Sumanth KanukulaFirst Published Mar 26, 2023, 12:31 PM IST
Highlights

భారతదేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,890 కరోనా కేసులు నమోదయ్యాయి.

భారతదేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,890 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 149 రోజులలో రోజవారి కరోనా కేసులలో ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 9,433కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం డేటాను విడుదల చేసింది. ఇక, గతేడాది అక్టోబర్ 28న దేశంలో ఒక్కరోజే 2,208 కేసులు నమోదయ్యాయి.

కరోనాతో ఏడు మరణాలు సంభవించగా.. అందులో గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్‌లలో  రెండు చొప్పున నమోదయ్యాయి. మిగిలిన మూడు మరణాలు.. కేరళతో నవీకరించ డేటాకు జోడించబడ్డాయి. ఇక, తాజా మరణాలతో దేశంలో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 5,30,831కి పెరిగింది. దేశంలో కోవిడ్ మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

తాజాగా నమోదైన 1,890 కరోనా కేసులతో కలిసి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,47,04,147కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో రోజువారి పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా నమోదు కాగా.. వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉంది. మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల సంఖ్య.. 0.02 శాతంగా ఉంది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,63,883కి పెరిగింది. 

ఇక, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.

click me!