
భారతదేశానికి యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఆ పార్టీల నాయకులు భవిష్యత్తులో ఈ యూసీసీ అమల్లోకి వస్తుందని చెపుతున్న నేపథ్యంలో ఒవైసీ ఈ విధంగా మాట్లాడారు.
మన దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అవసరం లేదని లా కమిషన్ కూడా అభిప్రాయపడిందని ఒవైసీ గుర్తు చేశారు. ‘‘ ఆర్థిక వ్యవస్థ విఫలమవుతోంది. నిరుద్యోగం పెరుగుతోంది, విద్యుత్-బొగ్గు సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలో BJP నేతృత్వంలోని ప్రభుత్వాలు UCC గురించి ఆందోళన చెందుతున్నాయి ’’ అని అన్నారు. UCC అమలుకు సంబంధించిన త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అనేక రాష్ట్రాలు ఇటీవలి రోజుల్లో వాగ్దానం చేశాయి. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ మండిపడ్డారు.
గోవా కామన్ సివిల్ కోడ్లో ఉన్న ఓ అంశంపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. గోవా కామన్ సివిల్ కోడ్ లో హిందూ పురుషుడు రెండుసార్లు వివాహం చేసుకోవడానికి అనుమతించే నిబంధన ఉందని అన్నారు. ‘‘గోవా సివిల్ కోడ్ ప్రకారం.30 ఏళ్లలోపు భార్య మగబిడ్డను ప్రసవించడంలో విఫలమైతే హిందూ పురుషులకు రెండవ వివాహం చేసుకునే హక్కు ఉంది. ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ వారు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు ’’ అని అన్నారు.
లౌడ్ స్పీకర్ వివాదంపై ఒవైసీ మాట్లాడుతూ... గతంలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఉందని అన్నారు. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రజలకు లౌడ్ స్పీకర్ సమస్య లేదా దానిని గుర్తించలేదా అని తెలిపారు. బీజేపీని ద్వేషించే సంస్థగా మారుస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే ఈ విద్వేషాన్నిసంస్థాగ తీకరించడానికి మాత్రమే ప్రోత్సహిస్తున్నారని ఒవైసీ బీజేపీపై మండిపడ్డారు.
దేశంలో మద్యపాన నిషేధం ఎందుకు లేదని ఒవైసీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మద్యాన్ని ఎందుకు నిషేదించడం లేదని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్, కామన్ కోడ్ మధ్య వ్యత్యాసం ఉందని చెప్పారు. భారత రాజ్యాంగంలో ముస్లిం సంస్కృతి పరిరక్షణ అంశం ఉందని తెలిపారు. తాము యూనిఫాం సివిల్ కోడ్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాల్లో బుల్డోజర్ల పాలనలో ఉన్నాయని అన్నారు. ఏ ముస్లిం అయినా మతోన్మాదంగా మారితే అది దేశానికి మేలు చేయదని తెలిపారు. దేశంలో లా అండ్ ఆర్డర్ అత్యున్నతమైనదని చెప్పారు. దానికి భంగం కలిగించకూడదని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం UCCని అమలు చేస్తామనే ఎన్నికల హామీని పునరుద్ఘాటించారు. దీని ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ముసాయిదాను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేయనుంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అలాగే ముస్లిం మహిళలందరికీ న్యాయం చేసేందుకు చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం వ్యాఖ్యానించారు. ఈ వారం ప్రారంభంలో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (టెని) UCCపై వ్యాఖ్యలు చేశారు.