
India-Pakistan tensions: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన ఘటన నేపథ్యంలో ఉగ్రవాదులకు అండగా ఉంటున్న పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పాకిస్తాన్ తో సంబంధాలను కట్ చేసుకుంది. దాదాపు అన్ని ఒప్పందాలు రద్దు చేసుకుంది. భారత్ పాకిస్తాన్ కు వరుసగా షాక్ లు ఇస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు, మాజీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ X (Twitter) ఖాతాలను భారత్లో నిలిపివేసింది. ఈ ఖాతాలపై లీగల్ డిమాండ్ మేరకు చర్యలు తీసుకున్నట్లు Xలో సందేశం కనబడుతోంది.
ఇప్పటికే భారత ప్రభుత్వం మన దేశంలో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసింది. వాటిలో పాక్ ప్రభుత్వ అధికారిక X హ్యాండిల్, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ X ఖాతా, పాక్ సమాచార శాఖ మంత్రి అటౌల్లా తరార్ ఖాతాలతో పాటు చాలా మంది అధికారుల ఖాతాలు ఉన్నాయి.
అలాగే, భారత్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్న పాక్ యూట్యూబ్ ఛానల్స్ పై కూడా నిషేధం విధించింది ఇండియా. భారత్ 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ను బ్యాన్ చేసింది. వీటి ద్వారా తప్పుడు సమాచారం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, భారత సైన్యం, భద్రతా యంత్రాంగాలపై తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
భారతదేశం ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేస్తే వారి రక్తం నదుల్లో ప్రవహిస్తుందంటూ బిలావల్ భుట్టో భారత్ ను రెచ్చగొట్టే కామెట్స్ చేశాడు.